Ind Vs Sa 1st Test: తొలి టెస్టు డ్రా అవుతుంది.. ఎందుకంటే: టీమిండియా మాజీ క్రికెటర్‌

Ind Vs Sa 1st Test: Game Would End In Draw Why Predicts Aakash Chopra - Sakshi

India vs South Africa Test: ‘‘ఒక్క ఓపెనర్‌ మాత్రమే 50 కంటే ఎక్కువ పరుగులు చేస్తాడు. మిగతా ఓపెనర్లంతా చాలా తక్కువ స్కోర్లకే అవుట్‌ అవుతారు.  ఈ పిచ్‌పై స్పిన్నర్లు ప్రభావం చూపుతారని అనుకోవడం లేదు. 40 వికెట్లు పడటం కష్టమే. ఫాస్ట్‌ బౌలర్ల హవా మాత్రం కొనసాగుతుంది. అంతా కలిసి 25 కంటే ఎక్కువ వికెట్లు పడగొడతారు. మొత్తంగా 30 వికెట్లు పడతాయేమో’’- టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా విశ్లేషణ ఇది. 

ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న తరుణంలోనే డిసెంబరు 26 నుంచి ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శుభారంభం చేసి ఎలాగైనా సఫారీ గడ్డపై సిరీస్‌ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని కోహ్లి సేన భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు... ప్రొటిస్‌ సైతం టీమిండియాను ధీటుగా ఎదుర్కొంటామనే ఆత్మవిశ్వాసంతో ఉంది. ఉత్కంఠ రేపుతున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తొలి టెస్టు డ్రా అవుతుందని జోస్యం చెప్పాడు. ఈ మేరకు.. ‘‘ఫాస్ట్‌ బౌలర్లదే పైచేయిగా ఉంటుంది. స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపలేరు. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. వరణుడు అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌ డ్రా అవుతుందనే అనిపిస్తోంది’’అని చెప్పుకొచ్చాడు. కాగా వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత కోహ్లి సారథ్యంలో.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గనిర్దేశనంలో విదేశంలో టీమిండియా ఆడే తొలి సిరీస్‌ ఇదే కావడంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది.   

చదవండి: India Vs SA: భారత అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. కొత్త కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top