IND VS ENG 1st Test Day 4: టీమిండియాకు షాక్‌ | IND VS ENG 1st Test Day 4: Shubman Gill Flops At No. 4, Massive Pressure On KL Rahul, Rishabh Pant | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test Day 4: టీమిండియాకు షాక్‌

Jun 23 2025 4:09 PM | Updated on Jun 23 2025 5:24 PM

IND VS ENG 1st Test Day 4: Shubman Gill Flops At No. 4, Massive Pressure On KL Rahul, Rishabh Pant

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్‌ చేశాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్‌ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్‌ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్‌ 40, క్రిస్ వోక్స్‌ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (4), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (30) ఔట్‌ కాగా.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (47), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.‌ 6 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్‌ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.

నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు షాక్‌
ఓవర్‌నైట్‌ స్కోర్‌ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌ చివరి బంతికే (24.6వ ఓవర్‌) బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో శుభ్‌మన్‌ గిల్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 

కేఎల్‌ రాహుల్‌కు జతగా రిషబ్‌ పంత్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. గిల్‌ వికెట్‌ కోల్పోవడంతో కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌పై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ ముందు టీమిండియా గౌరవప్రదమైన టార్గెట్‌ ఉంచాలంటే రాహుల్‌, పంత్‌ చాలా కీలకం కానున్నారు. వీరిద్దరు ఈ రోజంతా క్రీజ్‌లో ఉంటేనే భారత్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేయగలుగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement