IND Vs AUS: సంకట స్థితి.. నాలుగో టెస్టు గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు

How Does India Loss vs Australia Impact Its Chances For WTC-Final - Sakshi

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఓటమితో టీమిండియాకు సంకట స్థితి ఎదురైంది. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ​మ్యాచ్‌ డ్రా చేసుకున్నా అవకాశాలు ఉన్నప్పటికి ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. అలా జరగకూడదనుకుంటే భారత్‌ నాలుగో టెస్టులో ఆసీస్‌ను ఓడించాల్సిందే. ఇక మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది.

మూడో టెస్టుకు ముందు టీమిండియా 64.06 పర్సంటేజీ పాయింట్లతో రెండో స్థానంలోనే ఉంది. ఆస్ట్రేలియా 66.67 పర్సంటేజీ పాయింట్లో తొలి స్థానంలో ఉంది. అయితే మూడో టెస్టులో టీమిండియా 9 వికెట్ల తేడాతో పరాజయం చవిచూడడంతో ఆసీస్‌కు పర్సంటేజీ పాయింట్లు భారీగా పెరిగాయి.. అదే సమయంలో టీమిండియా పర్సంటేజీ పాయింట్లలో నాలుగు పాయింట్లు కోత పడింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 60.29 పాయింట్లు ఉండగా.. ఆస్ట్రేలియా ఖాతాలో 68.52 పాయింట్లు ఉన్నాయి.

ఇక మూడో స్థానంలో ఉన్న శ్రీలంక ఖాతాలో 53.33 పర్సంటేజీ పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రికా 52.38 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.  ఒకవేళ టీమిండియా ఆస్ట్రేలియాతో చివరి టెస్టును ఓడిపోయి సిరీస్‌ను 2-2తో ముగించడం.. అదే సమయంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను శ్రీలంక 2-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే మాత్రం భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లదు. టీమిండియా స్థానంలో శ్రీలంకకు అవకాశం ఉంటుంది. అయితే ఆ పరిస్థితి రాకూడదనుకుంటే టీమిండియా అహ్మదాబాద్‌ టెస్టును ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే.

చదవండి: మ్యాచ్‌ ఓడినా మనసులు గెలిచిన సిరాజ్‌

తప్పులే ఎక్కువగా.. ఎదురుదెబ్బ తగలాల్సిందే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top