ఐపీఎల్-2026 సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కథ దాదాపు ముగిసినట్లే. శనివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలం కావడంతో ముంబై ఈ ఘోర ఓటమిని మూట కట్టుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని సీఎస్కే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై బౌలర్లు మరోసారి విఫలమయ్యారు.
ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తాము మెరుగ్గా రాణించలేకపోయామని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
"కేవలం ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, సీజన్ మొత్తం మాకు కలిసిరాలేదు. ఈ రోజు సీఎస్కే అన్ని విభాగాల్లో మాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు. ఒకానొక దశలో మా స్కోర్ ఈజీగా 190 దాటుతుందని అని అనుకున్నాము. కానీ 10 ఓవర్ల తర్వాత మా రిథమ్ను కోల్పోయాం. చివర్లో మెరుపులు మెరిపించడంలోనూ విఫలమయ్యాం.
ఒకవేళ ఈ పిచ్పై 180 నుంచి 190 పరుగుల స్కోర్ వచ్చి పరిస్థితి మరో విధంగా ఉండేది. పిచ్ కాస్త స్లోగా ఉంది. అందుకే క్రీజులోకి రాగానే షాట్లు ఆడేందుకు కష్టమైంది. క్రీజులో సెటిల్ అయిన ప్రత్యర్ధి జట్టు బ్యాటర్లు సైతం ఇబ్బంది పడ్డారు. లెక్కలతో కూడిన క్రికెట్ ఆడటం చాలా అవసరం. కానీ ఈ రోజు మా బ్యాటర్లు బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయారు. వారు మాకంటే బాగా బ్యాటింగ్ చేశారని హార్దిక్ పేర్కొన్నాడు.
అదేవిధంగా బౌలింగ్లో మీరు మరింత దూకుడుగా ఉండాల్సిందా? అన్న ప్రశ్న కూడా పాండ్యాకు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఎదురైంది. అందుకు హార్దిక్ కాస్త వ్యంగ్యంగా సమాధనమిచ్చాడు. "ఇంకా ఎంత దూకుడుగా ఉండాలో నాకు తెలియదు. బహుశా వాళ్లను అవుట్ చేయడానికి నిప్పులు కురిపించే బంతులు వేయాలేమో. మా దగ్గర ఉన్న ఆప్షన్స్తోనే మేము బరిలోకి దిగాము" అని పాండ్యా వ్యాఖ్యనించాడు.
చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’


