ఐపీఎల్-2026 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన పేస్ అస్త్రం మిచెల్ స్టార్క్ మాత్రం జట్టుతో చేరలేదు. క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) నుంచి లీగ్లో ఆడేందుకు స్టార్ సీమర్కు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయలేదని తెలిసింది.
ఈ శనివారం లీగ్ ప్రారంభమవుతున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 1న జరుగనుంది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మొదటి మ్యాచ్కల్లా అతను అందుబాటులో ఉంటాడని ప్రాంచైజీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
సోమవారం మీడియా సమావేశంలో క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. "ఆసీస్ బోర్డు నుంచి ఎన్వోసీ కోసం మేం ఎదురుచూస్తున్నాం. అది వస్తే స్టార్క్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉండేది చెప్పగలం. ఈ మేరకు సీఏతో సంప్రదింపులు జరుపుతున్నాం" అని అన్నాడు.
ఫిట్నెస్ సమస్యలేమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు బదులిస్తూ అలాంటిదేమీ లేదని, నెట్స్లో అతను బౌలింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారముందని చెప్పాడు. క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల రావు మాట్లాడుతూ అతను వస్తున్నాడని, ఎన్ఓసీ ఆలస్యమే అసలు సమస్యని పేర్కొన్నాడు.
ఎన్ఓసీ జారీ చేస్తే తొలి మ్యాచ్ నుంచే స్టార్క్ అందుబాటులో ఉంటాడని చెప్పాడు. పేసర్ నటరాజన్ వందశాతం ఫిట్నెస్తో ఉన్నాడని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. గత సీజన్లో భుజం గాయం వల్ల నట్టు కేవలం రెండే మ్యాచ్లు ఆడాడు.
చదవండి: IPL 2026: సన్రైజర్స్కు భారీ శుభవార్త.. ఇక దబిడి దిబిడే


