న్యూస్రీల్
ఏజెంట్ల ద్వారా కొనుగోలు
అవే బియ్యం కొత్త సంచుల్లో నింపి
ప్రభుత్వానికి అందజేత
ఇటీవల పట్టుబడిన 1,100 క్వింటాళ్లు
దర్జాగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు
గతంలో దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దందా నడిపిన పలువురు మిల్లర్లు, సన్నబియ్యాన్ని సైతం వదలడం లేదు. అక్రమ వ్యాపారంతో కోట్లు గడించిన అక్రమార్కులు, ఇప్పటికీ తమ పంథా మార్చుకోవడం లేదు. జిల్లాలో కొందరు రైస్ మిల్లర్లు రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారు. పల్లె, పట్టణాల నుంచి మిల్లు వరకు ఒక చైన్ సిస్టం ఏర్పాటు చేసుకొని పకడ్బందీగా పకడ్బందీగా దందా నడుపుతున్నారు. ఈ బియ్యాన్ని కొత్త సంచుల్లో ప్యాకింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి రూ. కోట్లు ఆర్జిస్తున్నారు.
– సాక్షి, సిద్దిపేట
జిల్లాలో సన్న బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి ధాన్యాన్ని సీఎంఆర్ కింద మరాడించేందుకు రైస్ మిల్లులకు అప్పగిస్తుంది. కొందరు రైస్ మిల్లుల యజమానులు మాత్రం సీఎంఆర్ ధాన్యాన్ని విక్రయిస్తూ పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్నారు. ఈ లోటును పూడ్చుకునేందుకు కొంత మంది సన్న బియ్యం దందా ప్రారంభించారు. ధాన్యం స్థానంలో బియ్యం ఇవ్వడానికి, సన్న బియ్యాన్ని టార్గెట్ చేసుకొని కొందరు మిల్లర్లు దందా నడుపుతున్నారు. రేషన్ బియ్యాన్ని ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వానికి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు.
పల్లె.. పట్టణం నుంచి మిల్లుకు
రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు రైస్ మిల్లర్లు పలువురు ఏజెంట్లను నియమించుకున్నారు. వారు పల్లె, పట్టణాల్లో తిరుగుతూ కిలో బియ్యం రూ.10 నుంచి రూ.12కు కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల వారీగా సేకరించిన బియ్యాన్ని ముందుగా వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. అనంతరం సదరు ఏజెంట్లు ప్రత్యేక ఆటోలలో రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లకు సన్న బియ్యం కిలోకు రూ.18కి విక్రయిస్తున్నారు. ఈదందాకు కార్డుదారులు, రేషన్ డీలర్లు సహకరిస్తున్నారు.
ప్రత్యేకంగా నిఘా పెట్టాం
రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చర్యలు తప్పవు. సీఎంఆర్పై నిఘా కోసం ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేశాం. నిత్యం రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్నాం. మా దృష్టికి వస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం.
– గోపికృష్ణ, డీఎం, సివిల్ సప్లై కార్పొరేషన్
కరువైన నిఘా
ఈనెల 10న రాయపోలు మండలం రామారంలోని శ్రీ సాయి మహాదేవ రైస్ మిల్లులో హైదరాబాద్కు చెందిన టాస్క్పోర్స్ అధికారులు తనిఖీ చేశారు. 1,100 క్వింటాళ్ల పీడీఎస్ సన్న బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పౌరసరఫరాల అధికారులకు సమాచారం అందించడంతో ఆ మిల్లుపై కేసు నమోదు చేశారు. సీఎంఆర్పై పకడ్బందీగా నిఘా ఉంచాల్సిన జిల్లా అధికారులు నిద్రమత్తులో ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. టాస్క్ఫోర్స్ అధికారులు వచ్చి జిల్లాలోని పలు మిల్లుల్లో నడుస్తున్న సన్నబియ్యం దందాను వెలుగులోకి తెస్తుంటే.. స్థానిక అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా పౌరసరఫరాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రీసైక్లింగ్ దందాను కట్టడి చేయాలని కోరుతున్నారు.


