రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కీలకం
● బీఆర్ఎస్ పాలనలోనే అప్పులకుప్పగా మారిన తెలంగాణ ● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్
ప్రశాంత్నగర్(సిద్దిపేట)/సిద్దిపేటఅర్బన్/సిద్దిపేటరూరల్: బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్ర పరిస్థితి అప్పుల కుప్పగా తయారు చేశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మోహినీపుర శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని శనివారం మంత్రి లక్ష్మణ్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఆలయ ఈవో మారుతి, వేద పండితులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నాడు కేంద్రంలో తమ కేబినెట్లో ఉన్న మంత్రులు కృషి చేశారన్నారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టినా, ఆంధ్రాలో తమ పార్టీ అధికారంలోకి రాదని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అప్పటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏ పిలుపు ఇచ్చినా కాంగ్రెస్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారని, తమ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారని చెప్పారు.
విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని క్రమశిక్షణతో ఉంటూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ...రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గురుకులాలకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందని గుర్తు చేశారు. పాఠశాలలో విద్యార్థుల బట్టలు ఆరేసుకోవడానికి ప్లాట్ ఫాం నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కావాలని కోరగా ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే రూ.10 లక్షల విడుదల చేస్తామని, తర్వాత మిగతా నిధులు అందిస్తామన్నారు.
అధికారులతో మంత్రి సమీక్ష
జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ కె.హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ సదానందం, జిల్లా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పౌరసరఫరాల శాఖల అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాల సమస్యల పూర్తి సమాచారం అందించాలన్నారు. బెస్ట్ అవైలెబుల్ స్కూల్లలో చదువుకునే పిల్లలకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ట్రైసైకిళ్లు, పలు పరికరాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


