
ప్రజాస్వామ్యం అపహాస్యం
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం కావాలి
● ఓట్ల గల్లంతుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర
● మంత్రి పొన్నం ప్రభాకర్
● హుస్నాబాద్లో ఓట్ చోరీపై భారీ ర్యాలీ
హుస్నాబాద్: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగిస్తూ, ఓట్ల చోరీకి పాల్పడుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్లో బుధవారం ఓట్ చోరీపై భారీ ర్యాలీ నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓట్ చోరీకి పాల్పడుతున్న అంశాన్ని సాక్షాత్తు రాహుల్ గాంధీ దేశ ప్రజల ముందు ఉంచారన్నారు. నాలుగు రాష్ట్రాల్లో దొంగ ఓట్లను నమోదు చేయించుకొని ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందన్నారు. చంఢీగఢ్లో పని చేసే హైదరాబాద్కు చెందిన ఐపీఎస్ అధికారి పురన్ కుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇంత వరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదన్నారు. ఆయన భార్య మృత దేహంతో ధర్నా చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించ లేదన్నారు. ఎనిమిది మంది అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే కంటితుడుపు చర్యగా కేవలం రాష్ట్ర డీజీపీని మాత్రమే తొలగించారన్నారు.
ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేస్తాం..
బీఆర్ఎస్, బీజేపీ కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేసే కుట్రకు పాల్పడుతున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్, హరీశ్రావులు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు.
విద్యార్థి మృతి దురదృష్టకరం
హుస్నాబాద్రూరల్: మండల పరిధి పోతారం (ఎస్)లోని గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. బుధవారం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థి వివేక్ మృతిగల కారణలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆడుతున్న సమయంలో పడిపోయి మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, మరేదైన కారణలు ఉంటే పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు. విద్యార్థి మృతిని రాజకీయం చేయవద్దని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం అందించి బాసటగా ఉంటుందన్నారు. నిత్యం గురుకులాలు ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు.
హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో కొత్త విధానాన్ని తీసుకువచ్చామన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరూ ఓట్ చోరీపై సంతకాల సేకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.