
నిబంధనలు పాటిస్తేనే ఇళ్లకు బిల్లు
● కలెక్టర్ హైమావతి ● వర్గల్ మండలంలో పర్యటన
వర్గల్(గజ్వేల్): ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. ఇంటి నిర్మాణం 600 చదరపు అడుగులు దాటితే బిల్లు రాదన్నారు. మంగళవారం ఆమె వర్గల్, నెంటూరు, మీనాజీపేట గ్రామాలలో పర్యటించారు. ఆయా గ్రామాలలో శానిటేషన్ డ్రైవ్, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, పాఠశాలల్లో భోజనాలు, పారిశుద్ధ్యం తీరు సమీక్షించారు. ఎక్కడికక్కడా అధికారులను హెచ్చరిస్తూ అప్రమత్తం చేశారు. సీజనల్ వ్యాధులబారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మొరం చేరేలా పోలీస్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలన్నారు. మండలంలో 367 ఇండ్లు మంజూరయ్యాయని, 244 ఇండ్లకు మార్కింగ్ ఇచ్చామని, 38 మంది సుముఖంగా లేరని ఎంపీడీఓ మచ్చేందర్ కలెక్టర్కు నివేదించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని తహశీల్దార్ రఘువీర్రెడ్డిని ఆదేశించారు. నెంటూరు స్కూల్ లో మెనూకు భిన్నంగా టమాటా పప్పు పెడుతున్నట్లు గమనించి హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాహ్నభోజనంలో మెనూ పాటించాలని, స్కూల్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మీనాజీపేట హైస్కూల్ లో కిచెన్ గార్డెన్ను పరిశీలించి అభినందించారు.
పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టాలి
సిద్దిపేటరూరల్: జిల్లాలోని ఫార్మా, కెమికల్ కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల పర్యవేక్షణ శాఖ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలపై కార్మికులకు మాక్డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గణేశ్రామ్, డిప్యూటీ చీఫ్ ధర్మారెడ్డి, లేబర్ అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు.
బస్తీ దవాఖానలో కలెక్టర్ బీపీ చెకప్
గజ్వేల్: ఆకస్మిక తనిఖీలతో నిత్యం బిజీగా ఉంటున్న కలెక్టర్ హైమావతి మంగళవారం గజ్వేల్లోని కోటమైసమ్మ సమీపంలోగల బస్తీ దవాఖానాలో బీపీ చెకప్ చేయించుకున్నారు. ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన సందర్భంగా వైద్యాధికారి గౌతమితో మాట్లాడి తనకు బీపీ చెకప్ చేయాలని అడిగారు. వెంటనే సదురు వైద్యురాలు బీపీ చెకప్ చేసి నార్మల్గానే ఉందని తెలిపారు. అనంతరం మల్టీ విటమిన్ మందులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ఉధృతంగా ప్రబలుతున్నందువల్ల అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు పరీక్షలు జరిపి తగిన మందులు ఇవ్వాలని సూచించారు. అంతకుముందు అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. ఆ తర్వాత సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎంత మంది రోగులకు దవాఖానకు వస్తున్నారని, డెంగీ పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు.

నిబంధనలు పాటిస్తేనే ఇళ్లకు బిల్లు