
కొనుగోల్మాల్
తూకంలో నిలువుదోపిడీ
● మర్రిముచ్చాల ఐకేపీ నిర్వాహకుల మాయాజాలం ● 40 కిలోల బస్తాకు కిలో ధాన్యం అదనం ● పట్టించుకోని అధికారులు
ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు భిక్షపతి. కొమురవెల్లి
మండలం
మర్రిముచ్చాలకు చెందిన ఇతను 295 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో రెండు రోజుల క్రితం విక్రయించారు. ఎలక్ట్రానిక్ కాంటాలో 40 కిలోల బస్తాకు కిలో అదనంగా వచ్చేలా సెట్ చేయడంతో చాలా వరకు నష్టపోయారు. సుమారు 3
క్వింటాళ్ల ధాన్యం విక్రయించడంతో రూ.7 వేల వరకు నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్లు, కేంద్రం నిర్వాహకులు కుమ్మకై ్క రైతులను దోచుకుంటున్నారు. 40కిలోల బస్తాకు కిలో ధాన్యం అదనంగా తూకం వస్తోంది. సాంకేతికతను ఆధారం చేసుకుని ఎలక్ట్రానిక్ కాంటాలను సెట్చేయడం గమనార్హం. ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతులను యథేచ్ఛగా దగా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
మండలంలోని మర్రిముచ్చాల గ్రామంలో యాసంగి సీజన్ ధాన్యం సేకరించేందుకు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 8వేల క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి సేకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఐకేపీ నిర్వాహకులు.. మిల్లర్లతో కుమ్మకై ్క నయా మోసానికి తెరలేపారు. కొనుగోలు కేంద్రంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ కాంటాలను 40 కిలోలకు కిలో అదనంగా వచ్చేలా సెట్ చేశారు. ఐకేపీ కాంటా డిస్ప్లేలో 40 కిలోలు మాత్రమే చూపిస్తోంది. అనుమానంతో ఆదే ధాన్యం బస్తాను ప్రైవేటు కాంటాపై చూస్తే 41 కిలోలు చూపించడం గమనార్హం. రైతులు ఆదివారం తూనికరాళ్లతో కాంటాను చెక్ చేశారు. కాంటాలపై 20కిలోల తూనిక రాయిని ఉంచగా 19.500 గ్రాములుగా చూపించింది. గమనించిన రైతులు నిర్వాహకురాలిని నిలదీశారు. దీంతో నిర్వాహకురాలు స్పందిస్తూ.. కాంటాలు చెడిపోయాయని, వాటిని వాడకూడదని ఇటీవల హుస్నాబాద్కు చెందిన మెకానిక్ అఫ్జల్ తెలిపినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా.. ఈ సీజన్కు ఈ కాంటాలే వాడండని సూచించారన్నారు. వచ్చే సీజన్ నాటికి కొత్త కాంటాలను కొనుగోలు చేస్తామని చెప్పినట్లు చెప్పారు.
వీఓఏను తొలగించాం
మర్రిముచ్చాలలో తూకంలో దగా జరిగినట్టుగా రైతులు తెలిపారు. క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాం. మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. రైతులకు న్యాయం చేస్తాం. సెంటర్ నిర్వాహకురాలు వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) వందనను తొలగించాం.
–శ్రీనివాస్ రెడ్డి ఏపీఎం ఐకేిపీ
క్వింటాలుకు రెండున్నర కిలోలు నష్టం
ఎలక్ట్రానిక్ కాంటాలతో తూకం వేయడంతో క్వింటాలుకు రెండున్నర కిలోల ధాన్యం నష్టపోతున్నారు. ఒక్క శనివారం రోజే రైతులు నుంచి సేకరించిన ధాన్యం బస్తాలు 903 కాగా మద్దూరులోని ఓ రైస్ మిల్లుకు పంపిన ట్రాక్ షీట్లో మాత్రం 914గా రాసి పంపారు. రైతుల ప్రాథమిక విచారణలో 11 బస్తాలు అదనంగా రాసినట్లు తేలింది. ఈ లెక్కన కొనుగోళ్లు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంతమేర ధాన్యం అక్రమాలకు గురైందోనని రైతులు చెబుతున్నారు. ఈ మోసం ఒక్క మర్రిముచ్చాలలోనేనా? లేక మండల వ్యాప్తంగా కొనసాగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

కొనుగోల్మాల్