
హైవే నిర్మాణం.. చెట్లు మాయం
రామాయంపేట(మెదక్): మెదక్– రామాయంపేట మధ్య 20 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేల సంఖ్యలో ఏళ్ల క్రితం నాటిన చెట్లు ఉండేవి. ఈదారిలో ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. ప్రయాణికులు తమ వాహనాలను నిలుపుకొని చెట్లనీడలో సేద దీరేవారు. ఈక్రమంలో మెదక్ నుంచి సిద్దిపేట వరకు 70 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి మూడేళ్ల క్రితం కేంద్రం రూ. 882 కోట్లు మంజూరు చేసింది. పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే రోడ్డు పక్కన ఏళ్ల క్రితం నాటిన పెద్ద పెద్ద చెట్లను నిర్మాణంలో భాగంగా తొలగించారు. కూకటివేళ్లతో సహా పెకిలించి మరోచోట నాటడానికి ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నా అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. రామాయంపేట మండల పరి ధిలోని అటవీప్రాంతంలో నాలుగున్నర కిలోమీటర్లు తప్పించి, ఇతర చోట్ల చెట్ల తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. అనుమతులు వస్తే అటవీ ప్రాంతంలో చెట్లను కూ డా పూర్తిస్థాయిలో తొలగించి పనులు ప్రారంభిస్తామని జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మెదక్, రామాయంపేట, సిద్దిపేట మధ్య రోడ్డు పక్కన చెట్లను నరికివేయగా రహదారి బోసిపోయింది. అటవీ ప్రాంతంలో పరుచుకున్న పచ్చదనం సైతం త్వరలో కనుమరుగు కానుందని పర్యావరణ ప్రేమికులు తల్లడిల్లుతున్నారు.

హైవే నిర్మాణం.. చెట్లు మాయం