
రిజిస్ట్రార్ ప్రత్యేక పూజలు
బెజ్జంకి(సిద్దిపేట): వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రిజిస్ట్రార్ ఎన్రాంకుమార్ ఆదివారం బెజ్జంకి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆలయ పూజారి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లు తిరుమలరావు, భాస్కర్, ఎస్ఓలు శ్రీనివాస్రావు, ప్రవీణ్, ఏఎస్ఓ నరేందర్, న్యాయవాది పురం ప్రవీణ్, ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ పాల్గొన్నారు.
దళితబంధు దళారులపై చర్యలు తీసుకోండి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్
కొమురవెల్లి(సిద్దిపేట): దళితబంధు పేరుతో గత ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం లెనిన్నగర్లో దళితబంధు పథకం కోసం బీఆర్ఎస్ నాయకునికి డబ్బులు ఇచ్చి మోసపోయిన దాసరి హరిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం కోసం 2022లో హరిబాబు వద్ద మాజీ ఎంపీపీ భర్త కిషన్, అతని డ్రైవర్లు రూ.1,50,000 వసూలు చేశారన్నారు. డబ్బులను పలు మార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదని అన్నారు. ఇదే విషయమై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించి అతనికి డబ్బులను ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ మండల క్యార్యదర్శి కుడిక్యాల బాలమోహన్, నంగి కనకయ్య, బూరుగు సత్తయ్య, మల్లం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
నాలా పూడికతీత
సిద్దిపేటజోన్: లోతట్టు ప్రాంతాల ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. ఆదివారం కోమటిచెరువు శివారులో నాలా పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలో వరద నీటి వల్ల సమస్యలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ రాజనర్స్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడికి
డీఈఓ అభినందన
గజ్వేల్: ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థుల కోసం ‘సులభంగా తెలుగు నేర్చుకోవడం ఎలా?’ అనే పుస్తకాన్ని రచించిన మండలం మక్తమాసాన్పల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పి.నర్సింహులును డీఈఓ శ్రీనివాస్రెడ్డి అభినందించారు. సిద్దిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణలో నర్సింహులు పుస్తకం గురించి డీఈఓకు వివరించారు. కొత్తగా తెలుగు నేర్చుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతోందని డీఈఓ అన్నారు.

రిజిస్ట్రార్ ప్రత్యేక పూజలు

రిజిస్ట్రార్ ప్రత్యేక పూజలు