
కన్నీటిపాలు
అకాల వర్షాలతో ఆగమాగం
రైతు కష్టం..
నోటికాడికూడు వర్షార్పణం
దుబ్బాక: ధాన్యాన్ని కాపాడుకునేందుకు పాట్లు
జిల్లాలో భారీగా నష్టం
● 6,557 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
● ఫసల్ బీమా లేక అవస్థలు
● ప్రభుత్వం వైపు దీనంగా రైతన్న చూపు
అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నేలపాలవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 3.47లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయలు, తదితర పంటలు సాగు చేశారు. అయితే మార్చి 22 నుంచి ఈ నెల 26 వరకు కురిసిన అకాల వర్షాలు రైతులను కన్నీటిపాలు చేశాయి. ఇప్పటి వరకు జిల్లాలో 6,557 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా వరి 4,498 ఎకరాలు, మొక్కజొన్న 496, మామిడి 1,505ఎకరాలు, ఇతర పంటలు 58 ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారులు తెలిపారు.
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అకాల వర్షాలు రైతన్నను నట్టేట ముంచుతున్నాయి. చిన్నకోడూరు, నంగునూరు, జగదేవ్పూర్, ధూళ్మిట్ట, చేర్యాల, బెజ్జంకి, అక్కన్నపేట, గజ్వేల్, దౌల్తాబాద్ మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. సాగు పెట్టుబడి కోసం చేసిన అప్పులు.. ఈ అకాల వర్షాలతో వచ్చిన నష్టంతో రైతులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు.
ఫసల్ బీమా లేక..
కొన్నేళ్లుగా ఫసల్బీమా పథకాన్ని పాలకులు అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఎకరా వరికి రూ.450 ప్రీమియం చెల్లిస్తే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంట నష్టపోయిన రైతులకు చెదోడు వాదోడుగా ఫసల్బీమా నిలిచేది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి దెబ్బతిన్న పంట వివరాలను వ్యవసాయశాఖ అధికారులు అందించారు. ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం అందించనుంది. కానీ నష్టపరిహారం ఎపుడు వస్తుందోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
నేలరాలిన మామిడి...
జిల్లాలో 16 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. కొద్ది రోజులుగా అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో మామిడి రైతులు బెంబేలెత్తుతున్నారు. మామిడి కోతకు వచ్చిన సమయంలో వరుణుడు భయపెడుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,505 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.
దుబ్బాక: అకాల వర్షంతో దుబ్బాక మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. చాలా వరకు కొట్టుకుపోయింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నోటికాడికూడు వర్షార్పణం కావడంతో కన్నీటిపర్యంతమయ్యారు. వాన ఎప్పుడు వస్తదో తెలియని పరిస్థితి నెలకొందని, మళ్లీ వాన పడితే ధాన్యం చేతికిరాని పరిస్థితి నెలకొందన్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈదురుగాలులతో బీభత్సం
తొగుట(దుబ్బాక): మండలంలో ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కురిసిన అకాల వర్షానికి తొగుట, చందాపూర్, తుక్కాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. గజ్వేల్–సిద్దిపేట రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి.
కోళ్లఫారం ధ్వంసం
గజ్వేల్రూరల్/మర్కూక్: మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ప్రజ్ఞాపూర్ శివారులో నిర్మాణంలో ఉన్న కోళ్లఫారం ఈదురు గాలులకు ధ్వంసమైంది. రూ.70వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. అలాగే మర్కూక్ మండలంలో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
పరిహారం అందిస్తాం
ఈ యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్ల వానతో వరి, మొక్కజొన్న, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 6,557 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10వేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
–రాధిక, జిల్లా వ్యవసాయశాఖ ఆధికారి

కన్నీటిపాలు

కన్నీటిపాలు