తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్
రామాయంపేట(మెదక్): పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేయాలని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం వివేకానంద విద్యాలయంలో నిర్వహించిన సంఘం రాష్ట్ర సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా ధరలు పెరిగి ఉద్యోగులు కొనుగోలు శక్తిని కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. రావాల్సిన నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, పెండింగులో ఉన్న వైద్య బిల్లులను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల పేరిట ఆవాస ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లను మూసివేయవద్దని సూచించారు. నూతన విద్యావిధానం అమలు చేసే ముందు ప్రభుత్వం భవన సదుపాయాలు, ఇతర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి అన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్కుమార్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఐలయ్య, రాష్ట్ర సభ్యత్వ విభాగం కన్వీనర్ ప్రభాకర్రావు, జిల్లా అధ్యక్షుడు ప్రణీద్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, రాష్ట్ర భాధ్యులు సమత, నరేందర్నాయక్, అన్ని జిల్లాల బాధ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


