ఆర్థిక ఇబ్బందులతో..
వ్యక్తి ఆత్మహత్య
మర్కూక్(గజ్వేల్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని యూసుఫ్ఖాన్పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ దామోదర్, గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జంగిటి శ్రీకాంత్(27) ఆరేళ్ల క్రితం వర్గల్ మండలం సింగాయపల్లి గ్రామానికి చెందిన సంధ్యను వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇటీవల గ్రామ పెద్దలు, బంధువులు వారికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో మూడురోజుల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగడంతో సంధ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. విషయం తెలుకున్న పోలీసులు సంఘటన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. మృతుడికి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అనుమానాస్పదంగా బాలిక..
దుబ్బాకటౌన్: అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పట్టణంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై కీర్తిరాజు వివరాల ప్రకారం... పట్టణంలోని మారెమ్మ గడ్డకు చెందిన కొండపల్లి నిర్మలకు 17 ఏళ్ల క్రితం నూనె చంద్రంతో వివాహం కాగా, వీరికి తొమ్మిదో తరగతి చదివే 15 సంవత్సరాల కుమార్తె ఉంది. కాగా కూతురుకు మూడేళ్లున్నప్పుడు భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఆరు సంవత్సరాల క్రితం నిర్మల తూప్రాన్కు చెందిన కొండపల్లి అశోక్ను రెండో వివాహం చేసుకోగా, వీరికి ముగ్గురు సంతానం. కూలిపనులు చేస్తూ పట్టణంలోని డబుల్ బెడ్రూం సముదాయంలో నివాసముంటున్నారు. అయితే కొంత కాలం వరకు మొదటి భర్తకు పుట్టిన కూతురు, అమ్మమ్మ, తాతతో కలిసి మారెమ్మ గడ్డలోనే ఉండేది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం వారు పెద్ద కుమార్తెను నిర్మల వద్దకు చేర్చారు. అప్పటినుంచి మారు తండ్రి అశోక్, కుమార్తెతో నువ్వు నా ఇంట్లో ఉండవద్దని, మీ అమ్మమ్మ, తాతయ్య వద్దకే వెళ్లిపోవాలని గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి కూడా పెద్ద కుమార్తె విషయంలో మరోసారి భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరగడంతో, చుట్టుపక్కల వాళ్లు వచ్చి సముదాయించారు. అనంతరం అందరూ భోజనం చేసి హాలులో పడుకున్నాక, బెడ్రూమ్లో పెద్ద కుమార్తె చీరతో ఉరివేసుకొని కనిపించింది. కొంత సేపటికి గుర్తించిన తల్లి, మారు తండ్రి వెంటనే బాలిక మృతదేహాన్ని కిందికి దించి, మారెమ్మ గడ్డలోని పాత గుడిసెలోకి తీసుకెళ్లారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి తరలించారు. కాగా కుమార్తె మృతిపై తన రెండో భర్త అశోక్పై అనుమానం ఉన్నదని, నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తూప్రాన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని వట్టూరులో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పాంబండ బాబు(40) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి నిత్యం మద్యం తాగుతున్నాడని మృతుని భార్య మమత తెలిపారు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఇంట్లో ఎవరులేని సమయంతో బాబు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య మమత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


