పాపన్నపేట(మెదక్): ట్రాన్స్జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ట్రాన్స్జెండర్లు..మండల వాసులతో అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్జెండర్లు అంటే అందరికీ సానుభూతి, గౌరవం ఉంటుందన్నారు. అందువల్ల ప్రజలతో మమేకమై, హుందాగా బతుకాలని పిలుపునిచ్చారు. సీఐ జార్జ్ మాట్లాడుతూ.. శుభకార్యాలకు వచ్చే ట్రాన్స్ జెండర్లు ఇష్టంతో ఇచ్చే డబ్బులను సంతోషంగా స్వీకరించాలని చెప్పారు. అనవసరంగా శాపాలు పెడుతూ, ఇబ్బంది పెట్టొద్దన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు సమాజంలో భాగమమేనన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి వివాహాలు చేస్తుంటే, వారి నుంచి బలవంతంగా వసూళ్లు చేయడం తగదన్నారు. ట్రాన్స్జెండర్స్ జిల్లా ప్రతినిధి అంజలి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు కూడా మనుషులేనన్నారు. వారి పట్ల సమాజంలోని కొంత మంది ప్రవర్తిస్తున్న తీరు బాధగా ఉంటుందన్నారు. తాము కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిందని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ హేమభార్గవి అన్నారు. ట్రాన్స్జెండర్ల వేధింపులపై తమకు తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ట్రాన్స్జెండర్లకు
డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచన


