చేర్యాల(సిద్దిపేట): మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని శభాష్గూడెంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, కొమురవెల్లి పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఉల్లంపల్లి గణేశ్(29) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసైన అతడు పని చేయగా వచ్చిన డబ్బులు మొత్తం మద్యానికి ఖర్చు చేస్తుండటంతో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గణేశ్ సోమవారం బావి వద్ద ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్దలతో..
జిన్నారం (పటాన్చెరు): భార్యాభర్తల మధ్య మనస్పర్దలతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం... గుమ్మడిదలకు చెందిన పోచగారి రాజిరెడ్డి (43) యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన కవితతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప సంతానం. కాగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తతో గొడవపడిన కవిత సొంతూరుకు వెళ్లింది. మనస్తాపం చెందిన భర్త సంజీవరెడ్డి సోమవారం స్థానిక బావి వద్ద విద్యుత్ హైటెన్షన్ స్తంభానికి చీరతో ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


