100% వసూళ్లపై అధికారుల దృష్టి
ఆన్లైన్లో చెల్లింపులకు అవకాశం
రూ.47 కోట్లు
వసూలైంది
రూ.111 కోట్లు
సంగారెడ్డి జోన్: జిల్లాలోని మున్సిపాలిటీలలో ఈ ఆర్థిక ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు మరో 16 రోజులు మాత్రమే గడువు మిగిలిఉంది. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 50% మాత్రమే పన్ను వసూలైంది. సమయం తక్కువగా ఉండటంతో ఆ శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూళ్లు వేగిరం చేస్తున్నారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో అంతలోపు పన్ను వసూళ్లు 100% పూర్తవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలో ఉన్న 11 మున్సిపాలిటీలలో ఈ ఆర్థిక ఏడాదికిగాను రూ.111.55 కోట్ల మేర వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సోమవారం వరకు జిల్లావ్యాప్తంగా రూ.47.04లక్షలు మాత్రమే వసూలైంది. గడ్డపోతారం మున్సిపాలిటీలో అత్యధికంగా వసూలు కాగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో అతి తక్కువగా పన్ను వసూలైంది. ఐదు మున్సిపాలిటీలలో 50% వసూలు కాగా మిగతా 6 మున్సిపాలిటీలలో సగం కూడా పూర్తి కాలేదు. ఇంటి పన్నుతోపాటు నీటి, వృత్తి వ్యాపార పన్ను వసూళ్లలో వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ఇంటింటికి తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను చెల్లించిన వారికి అక్కడే రశీదును అందిస్తున్నారు. ఇక పన్ను చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా పన్ను చెల్లించాలనుకునేవారికి http://cdma.telanga na.gov.in వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించారు. వసూలైన పన్ను మొత్తాన్ని ఏరోజుకారోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల అభివృద్ధికి వివిధ రకాల నిధులు మంజూరు చేస్తుంటాయి. వీటితోపాటు స్థానిక వనరులతో ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వివిధ రకాల పేర్లతో వసూలైన పన్నులతో ఆయా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తిరిగి ఖర్చు చేస్తుంటారు.


