● 22 నుంచి పెట్టుబడి సాయం
● మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ
మెదక్ అర్బన్: అన్నదాతల ఎదురుచూ పులు ఫలించే వేళ ఆసన్నమైంది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలో సుమా రు 2,62,043 రైతులకు గానూ రూ.220.84 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది.
ఎకరానికి రూ.6 వేలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023–24 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5 వేలు, 2024–25 యాసంగిలో రూ. 5 వేలు, 2025–26లో వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, రైతు భరోసా నిధులు జమ చేయలేదు.
సాగులో 2,86,225 ఎకరాలు
జిల్లాలో యాసంగికి సంబంధించి 2,86,225 ఎ కరాల్లో పంటలు వేశారు. సుమారు 2,62,043 రైతులు ఉన్నారు. గత వానాకాలం లెక్కలకు సంబంధించి అప్పట్లో రైతు భరోసా కింద రూ.220,84,32,452 నిధులు విడుదలయ్యాయి. ఈసారి నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా మొత్తం మంది రైతులకు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ను వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు.


