సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గ్రామీణ పేద ప్రజల పొట్ట కొట్టే వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఎంపీడీఓ లక్ష్మికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత 20 ఏళ్లుగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం దుర్మార్గమన్నారు. దీంతో కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


