ఏడుపాయల్లో కట్టెల పొయ్యిపై
ప్రసాదం తయారీ
ఏడుపాయలకు తాకిన గ్యాస్ కొరత
ఒక్క రోజు నిలిచిన లడ్డూ ప్రసాదం ● తప్పని కట్టెల పొయ్యి
పాపన్నపేట(మెదక్): పశ్చిమాసియా యుద్ధం మంటలు ఏడుపాయల లడ్డూ ప్రసాదానికి కూడా తాకాయి. గ్యాస్ సిలిండర్లు దొరకక మూడు రోజుల నుంచి పొయ్యి వెలగలేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు గత వారం రోజులుగా దొరకడం లేదు. దీంతో గురువారం భక్తులకు అమ్మవారి ప్రసాదం కరువైంది. చివరకు కట్టెల పొయ్యి రాజేసి శుక్రవారం లడ్డు పులిహోర తయారు చేసి, భక్తులకు అందించారు. వివరాల్లోకి వెళ్తే... తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వనదుర్గమ్మ ప్రసాదం లడ్డూ, పులిహోర విక్రయిస్తారు. లడ్డూ రూ.20, పులిహోర రూ.10కి అమ్ముతుంటారు. ప్రతి రోజు ఎంత లేదన్నా రూ.70 నుంచి రూ.80 వేల ప్రసాదం విక్రయిస్తారు. ఆదివారం ప్రసాదం ద్వారా రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఇందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడుతుంటారు. నెలకు 80 నుంచి 100 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. మొదట్లో రూ.2019 ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్, యుద్ధం తర్వాత రూ.2133కు చేరింది. ఇప్పుడు అవి కూడా దొరకడం లేదు. దీంతో ఏడుపాయల్లో గత ఆదివారం తయారు చేసిన ప్రసాదం, బుధవారం వరకు అందుబాటులో ఉంది. గురువారం మాత్రం భక్తులకు ప్రసాదం అందలేదు. దీంతో మట్టి పొయ్యి నిర్మించి కట్టెల మంట ద్వారా లడ్డు ప్రసాదం తయారు చేయించి, భక్తులకు అందజేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.


