– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ , సంగారెడ్డి
గ్యాస్ గోస
పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా వచ్చిన గ్యాస్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ అడగటం, బుకింగ్ కాకపోవటం, సర్వర్ డౌన్ కారణంగా జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అసలే ఇప్పుడు పరీక్షల సమయం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని ఏజెన్సీ నిర్వాహకులతో వినియోగదారులు గొడవ పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో హాస్టళ్లు, హోటళ్లు, కర్రీపాయింట్ నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. కట్టెల ధర ఎక్కువగా ఉండటం, విపరీతమైన పొగ రావటంతో వంట చేసే వారి బాధలు వర్ణనాతీతం.
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రావీణ్య, చిత్రంలో ఎస్పీ పరితోష్
సంగారెడ్డి జోన్: జిల్లాలో గ్యాస్ నిల్వలు చేసి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో గ్యాస్ సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల కొరత ఎక్కడా లేదన్నారు. వినియోగదారులు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు ఏదైనా సమస్య ఎదురైతే స్థానిక ఎస్హెచ్ఓ, 100 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా పౌర సరఫరాల అధికారి బాలసరోజ, సహాయ పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, సంక్షేమ శాఖల అధికారులు అఖిలేష్ రెడ్డి, జగదీష్, రాజేశ్వర్ అంబదాస్, లలిత కుమారి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎల్పి.జి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.
కోత్లాపూర్లో సిలిండర్ కోసం క్యూ లైన్లో నిలబడిన జనం
కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరిక
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు
ప్రాధాన్యత క్రమంలో బుకింగ్ చేసుకోవాలి


