సంగారెడ్డి టౌన్: ఉపాధి హామీ పనులు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు డీఆర్డీఏ బాలరాజు అన్నారు. శుక్రవారం మండల ఎంపీడీఓ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 11 గ్రామాల్లో ఏడాది పాటు జరిగిన ఉపాధి హామీ పనులపై ఆడిట్ నిర్వహించారు. అధికారులు విధులు సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సరైన రికార్డులు లేని గ్రామాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా, మండల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
78 మందికి ఆఫర్ లెటర్లు
జాబ్ మేళాకు స్పందన
సంగారెడ్డి టౌన్: మహేంద్ర కంపెనీ నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్లో 78 మందికి ఆఫర్ లెటర్లు అందించారు. మరిన్ని కంపెనీలను ముందుకు తీసు కొచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. జహీరాబాద్ మహేంద్ర కంపెనీ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్ పరీక్షలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 15,765 మంది విద్యార్థులకు గానూ 15,330 మంది విద్యార్థులు హాజరు కాగా 435 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 14,327 మంది విద్యార్థులకు గానూ 14,029 మంది విద్యార్థులు హాజరు కాగా 298 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1438 మంది విద్యార్థులకు గానూ 1301 మంది విద్యార్థులు హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 97.24గా నమోదైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి గోవిందరాం తెలిపారు.
సీసీ రోడ్లకు రూ.2 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే
జహీరాబాద్ టౌన్: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్ల ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆదివారం నుంచి ప్రారంభిస్తామన్నారు. ఝరాసంగం మండలంలోని 12 గ్రామాలకు గాను రూ.60 లక్షలు, కోహీర్ మండలంలోని మూడు గ్రామాలకు రూ.20 లక్షలు, మొగుడంపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు రూ. 35 లక్షలు, న్యాల్కల్ మండలంలోని 10 గ్రామాలకు గాను రూ. 45 లక్షలు, జహీరాబాద్ మండలంలోని 9 గ్రామాలకు రూ. 40 లక్షల చొప్పన నిధులు మంజూరు అయినట్లు వివరించారు.


