జొన్నలకు మంచి డిమాండ్
జహీరాబాద్ టౌన్: ఇటీవల కాలంలో ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు రావడంతో జొన్నలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండే ఇప్పుడు జొన్న రైతులకు సిరులు కురిపిస్తోంది. సాధారణంగా యాసంగిలో రైతులు ఆరుతడి పంట ల సాగుకు ఆసక్తి చూపుతారు. కూరగాయలు, శనగ, మొక్కజొన్న, కుసుమ, గోధుమ, ఉల్లితోపాటు జొన్న పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ల మేతకు ఉపయోగిస్తారు. రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. మార్కెట్లో కూడా ధర ఆశాజనకంగా ఉండటంతో జొన్నను రబీలో ఎక్కువస్థాయిలో పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.
యాసంగిలో రైతులు జొన్న పంట సాగుకు ఆసక్తి చూపడంతో జిల్లాలో పంట విస్తీర్ణం పెరిగింది. జొన్న పంటకు నల్లరేగడి నేలలు అనుకూలం. జిల్లాలోని మునిపల్లి, నారాయణఖేడ్, మనూర్, న్యాల్కల్, రాయికోడ్, కోహీర్, ఝరాసంగం, జహీరాబాద్ తదితర మండలాల్లో జొన్న సాగువుతుంది. రాష్ట్ర సరిహద్దులో గల కర్ణాటకలో కూడా ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పండిస్తున్నారు. జిల్లాలో గతేడాది జొన్న పంట సుమారు 25 వేల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది విస్తీర్ణం రెట్టింపు అయింది. సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు పంట పండిస్తున్నారు.
పెరుగుతున్న పంట విస్తీర్ణం జొన్నలకు మంచి డిమాండ్
అనువైన రకాలు ఎంపిక చేసుకోవాలి
అధిక దిగుబడులను సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చేసుకోవాలి. సాగు విధానంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. జొన్నకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందని, ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులకు లాభం కలుగుతుందన్నారు.
–భిక్షపతి, వ్యవసాయశాఖ ఏడీఏ
చిరుధాన్యాల్లో ముఖ్యమైన జొన్నలను ఆరోగ్యం కోసం ఏకమొత్తంగా ఆహారం కోసం తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జొన్న రొట్టెలను ఇష్టంగా తింటుడటంతో జొన్నలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. క్వింటాల్కు రూ.6 వేల వరకు పలుకుతోంది. ఎకరాకు సగటున 25–30 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. జొన్నకు తెగుళ్ల బెడద ఆశించినంతగా ఉండదు. నెమళ్లు, అడవి పందుల బెడద నుంచి రక్షించుకునేందుకు శ్రమిస్తే చాలు.


