పెద్దశంకరంపేట(మెదక్): అక్రమంగా తరలిస్తున్న గోవులను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం.. మొయినాబాద్ నుంచి మహారాష్ట్ర డెగ్లూర్ వైపు టాటా ఏసీ వాహనంలో తరలిస్తుండగా వాహనాన్ని మండల పరిధిలోని కోళాపల్లి పాత టోల్ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గోవులను తరలిస్తున్న షఫీ, మోసిన్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రెండు గోవులు, ఒక దూడను స్థానిక గోశాలకు తరలించారు.
ఇసుక వేలంతో
రూ.4.15 లక్షల ఆదాయం
పాపన్నపేట(మెదక్): గాజులగూడెం నుంచి ఇసుక అక్రమ తరలింపుపై ‘సాక్షి’ కథనాలకు రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేశారు. ఈ మేరకు సీజ్ చేసి ఇసుకకు బుధవారం వేలం పాటలు నిర్వహించగా రూ. 4,15,935 ఆదాయం వచ్చినట్లు గిర్దావర్ సత్తు స్వామి తెలిపారు. క్యూబిక్ మీటర్కు రూ.585 చొప్పున వేలం పాటలు ఖరారయ్యాయని చెప్పారు. మొత్తం 237 ట్రాక్టర్లకు గాను, 711 క్యూబిక్ మీటర్ల ఇసుక వచ్చిందన్నారు. వేలం పాటలో గ్రామానికి చెందిన ప్రతాప్గౌడ్ అధిక పాట పాడి వేలం దక్కించుకున్నారని తెలిపారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
గజ్వేల్రూరల్: కుటుంబ సభ్యులంతా నూతన ఇంట్లోకి పడుకునేందుకు వెళ్ళగా... పాత ఇంట్లో దొంగలు పడి రూ.2లక్షల 70వేల విలువైన వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన సంఘటన గజ్వేల్ మండలం రిమ్మనగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన పంజాల శివలింగంగౌడ్ ఇదే గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకుంటూ సమీపంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టి ఇటీవలే గృహ ప్రవేశం చేశారు. ఇంట్లోని సామగ్రి అంతా పాత ఇంట్లోనే ఉండడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నూతన ఇంట్లో పడుకునేందుకు వెళ్లారు. బుధవారం ఉదయం పాత ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో దాచి ఉంచిన నగదుతోపాటు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జహీరాబాద్ టౌన్: బైక్ను ఆటో ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ రాజేందర్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్కు చెందిన పట్లోళ్ల రాంరెడ్డి(52) బుధవారం బైక్పై పొలానికి వెళ్తున్నాడు. గ్రామ శివారులో ఎదురుగా అతివేగంగా వస్తున్న ఆటో మోటారు బైక్ను ఢీకొట్టింది. రాంరెడ్డికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
భార్య హత్య కేసులో
భర్తకు జీవిత ఖైదు
జహీరాబాద్ టౌన్: భార్యను హత్య చేసిన కేసులో జిల్లా సెషన్స్ జడ్జి భవానీ చంద్ర భర్తకు జీవిత ఖైదు తీర్పు ఇచ్చారని టౌన్ ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు. ఝరాసంగం మండలంలోని ఏడాకుపల్లికి చెందిన డుబుడం రాములు(38)తో పట్టణంలోని సంతోషిమాత కాలనీకి చెందిన లక్ష్మితో 2012లో వివివాహమైంది. మద్యానికి బానిసైన రాములు భార్యను వేధించడంతో ఆమె తల్లివద్ద ఉంటూ పట్టణంలోని ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుంది. మద్యం తాగి ఆమె పనిచేసే ప్రింటింగ్ ప్రెస్ వద్దకు వచ్చి గొడవ పడేవాడు. వేధింపులను తట్టుకోలేక భర్తపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేిసింది. దీంతో ఆమైపె కక్ష పెంచుకుని హత్య చేయాలని రాములు నిర్ణయించుకున్నాడు. 16న డిసెంబర్ 2021లో భార్య లక్ష్మికి మాయమాటలు చెప్పి శివాలయం ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముళ్లపోదలో పడేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈమేరకు జిల్లా జడ్జి భవానీ చంద్ర నిందితుడు రాములకు జీవిత ఖైదుతో పాటు రూ. 1000 జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్ఐ వినయ్కుమార్ వివరించారు.


