ఓయూ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కృష్ణకుమార్
వర్గల్ పూలే గురుకులంలో సదస్సు
ఉగ్రవాద నిర్మూలనే
వర్గల్(గజ్వేల్): అంతర్జాతీయ స్థిరత్వ సాధనకు దేశాల మధ్య పరస్పర సహకారం అత్యవసరమని, ఉగ్రవాద నిర్మూలన, పర్యావరణ సమస్యల పరిష్కారం వంటి అంశాలలో ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కృష్ణకుమార్ అన్నారు. బుధవారం వర్గల్ మహాత్మాజ్యోతిబా పూలే మహిళా డిగ్రీ కళాశాలలో ‘ద్వైపాక్షిక సమస్యలపై భౌగోళిక రాజకీయాల ప్రభావం’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ భద్రతపై రాజకీయాలు ప్రభావం చూపుతాయన్నారు. సాంకేతిక అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీపై నియంత్రణ, కృత్రిమ మేధస్సు(ఏఐ) వినియోగం, ఆర్థిక దౌత్యం వంటి అంశాలు ఆధునిక అంతర్జాతీయ రాజకీయాలలో కీలకంగా పరిణమించాయన్నారు. దేశాల భౌగోళిక స్థానం, సహజ వనరులు, భూభాగం, జనాభా వంటి అంశాలు ఆయా దేశాల శక్తి సామర్థ్యాల నిర్ణయంలో ప్రధాన భూమిక పోషిస్తాయని వివరించారు. ప్రపంచ దేశాల మధ్య శక్తి సమీకరణాలను అర్థం చేసుకోవడంలో జియోపాలిటిక్స్, జియోఎకానామిక్స్ ముఖ్యమైన దృష్టి కోణాలను అందిస్తాయని తెలిపారు. ఈ సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చల్లమల్ల వెంకటేశ్వర్లు, బేగంపేట్ మహిళా కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామాచారి, ఆతిథ్య గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గడ్డం భాస్కరరావు, వర్జిని దేదిప్య, జయలక్ష్మి, ఏకే చందన, రజని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏ భాగ్యలక్ష్మి తదితర 8 మంది స్కాలర్స్ జియో పాలిటిక్స్ అంశం పైన పత్ర సమర్పణ చేశారు. భౌగోళిక రాజకీయ అంశాలతో కూడిన సావనీర్ను సదస్సులో ఆవిష్కరించారు.


