ఒకరి మృతి, పలువురికి గాయాలు
గజ్వేల్రూరల్: రింగురోడ్డు వద్ద మలుపు తిరుగుతున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరికొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మండల పరిధిలోని రిమ్మనగూడ శివారులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, జీపీపీ ఆర్టీసీ డిపో అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వస్తోంది. ఈ క్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ శివారులోని రింగురోడ్డు వద్ద మలుపు తిరుగుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన బస్సు డీకొంది. ముందు సీట్లో కూర్చున్న ప్రయాణికుడు చిన్నకోడూరు మండలం లింగారెడ్డిపల్లికి చెందిన రంగు సత్యనారాయణ(70)కు తీవ్ర గాయాలు కాగా, బస్సు డ్రైవర్తో పాటు మరికొంత మందికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా రంగు సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.


