వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని బిజిలీపూర్లో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూల్చడం వివాదాస్పదమైంది. వివరాలు ఇలా.. గ్రామంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా మంగళవారం పాఠశాల ప్రహరి గోడను కూల్చివేశారు. దీంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రహరీ పక్కనే ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి పిల్లరు వేశారు. శివాజీ జయంతి ఉత్సవాల సమయాల్లో తమకు ఇబ్బందిగా ఉంటుందని శివాజీ సేన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంఈఓ రంజిత్కుమార్ను వివరణ కోరగా.. పాఠశాల ప్రహరీ కూల్చివేత విషయం తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఐజల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రహరీ గోడను కూల్చడంపై గ్రామస్తులు వ్యతిరేకించిన విషయం వాస్తవమే. ప్లాంట్ పూర్తయిన తర్వాత ప్రహరీని పునరుద్ధరించే పనులు చేపడుతామని పంచాయతీ కార్యదర్శి మహ్మద్ నవీద్ అహ్మద్ తెలిపారు.


