● చట్టాలపై విద్యార్థులకు అవగాహన ● సీనియర్ సివిల్ జడ్జి సౌజన్య
హత్నూర(సంగారెడ్డి): విద్యార్థులు తప్పుడు మార్గంలో వెళితే ఇబ్బందులు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య అన్నారు. సోమవారం హత్నూర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడవద్దని, అలాంటివారు కటకటాలపాలై జీవితాలు విచ్ఛినం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. బాల్యవివాహాలు, ప్రేమ పేరుతో వేధింపులు, ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమని, కేవలం పుస్తకాలపైనే దృష్టి సారించి చదువులో రాణించాలన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో భోజనాన్ని పరిశీలించారు.. అంతకుముందు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను పరిశీలించారు.
అపరిశుభ్రత వాతావరణంపై అసహనం:
గురుకుల పాఠశాలను సందర్శించిన ఆమె. విద్యార్థులకు వండుతున్న వంటశాలను పరిశీలించారు. అక్కడి వాతావరణాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు ఎలా చేస్తున్నారని, దీనివల్ల రోగాలు ప్రబలే అవకా శం ఉందని సిబ్బందిని మందలించారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఎస్సై శ్రీధర్ రెడ్డి, వైద్యురాలు రజిని, సర్పంచ్ ఎల్లయ్య పాల్గొన్నారు. కాగా, మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


