వట్పల్లి(అందోల్): 12 ఏళ్ల తర్వాత అందోల్ మండలంలోని జోగిపేట–మాసానిపల్లి రోడ్డు ఎట్టకేలకు బీటీ సొగసులు రూపుదిద్దుకుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర రాజనర్సింహ మట్టి రోడ్డుగా ఉన్న ఈ రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టారు. అప్పటినుంచి మొన్నటి వరకు కూడా ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో గుంతలమయంగా మారి.. కంకర తేలిన రోడ్డుపై ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు చాలా మంది ప్రమాదాలకు గురై అంగవైకల్యం పొందిన వారు కూడా ఉన్నారు. 3 కి.మీ రోడ్డుకు రూ.1.68 కోట్లతో రెండు లేయర్ల బీటీ రోడ్డును చేపట్టారు. దీంతో మరో పదేళ్ల వరకు ఢోకా ఉండదన్న అభిప్రాయాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. నిధులను మంజూరు చేయించిన మంత్రి దామోదరకు ఆత్మకమిటీ డైరెక్టర్ అశోక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్లు కృతజ్ఞతలు తెలిపారు.


