లక్షల ఎంటీలు..
● ఈసారి 221 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ● ఖరారైన ప్రణాళిక
ధాన్యం సేకరణ లక్ష్యం
దొడ్డురకం 2 లక్షల మెట్రిక్ టన్నులు ● 20 వేల ఎంటీలు సన్నరకం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ యాసంగి సీజనులో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. గతేడాది యాసంగి కంటే సుమారు 70 వేల మెట్రిక్ టన్నులు ఎక్కువ ధాన్యం మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇందులో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం ధాన్యం కాగా, 20 వేల మెట్రిక్ టన్నుల సన్నరకాలు సేకరించాల్సి ఉంటుందని భావిస్తోంది. గత ఏడాది యాసంగిలో 1.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసిన విషయం విధితమే. ఈ యాసంగి ధాన్యం సేకరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను జిల్లా అధికార యంత్రాంగం ఇటీవల ఖరారు చేసింది. జిల్లాలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 83,986 ఎకరాలు. అయితే ఈసారి 92,560 ఎకరాల్లో దొడ్డురకాల వరిని పండిస్తున్నారు. 9,780 ఎకరాల్లో సన్నరకాలను సాగు చేస్తున్నారు. మొత్తం 1.02 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఒక్కో ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. క్రాప్కటింగ్ ఎక్స్పర్మెంట్ ద్వారా దిగుబడిని అంచనా వేస్తారు. ఈ లెక్కన 2.52 లక్షల ధాన్యం పండుతుందని భావిస్తున్నారు. ఇందులో రైతుల సొంత వినియోగం, విత్తనాల కోసం, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం సుమారు 32,916 క్వింటాళ్లుగా ఉండే అవకాశాలున్నాయి. ఈ ధాన్యం మినహాయిస్తే 2.20 లక్షల క్వింటాళ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు.
27 మిల్లులకు సీఎంఆర్ ధాన్యం
సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మొత్తం 27 బాయిల్డ్ రైస్మిల్లులను ఎంపిక చేశారు. యాసంగిలో ధాన్యం నూక ఎక్కువయ్యే అవకాశాలుండటంతో కేవలం బాయిల్డ్ మిల్లులకే సీఎంఆర్ కేటాయింపులు చేస్తుంటారు. దీంతో రా రైస్మిల్లులకు ఈ యాసంగి ధాన్యం కేటాయింపులుండే అవకాశాల్లేవని అధికారులు పేర్కొంటున్నారు.


