సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్య
పటాన్చెరు టౌన్: పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పటాన్చెరు పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్య మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రూ.905 ఉన్న గ్యాస్ ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని వాపోయారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్నా యుద్ధం విషయంలో మన ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం మనకు ఆయిల్ నిక్షేపాలు రష్యా నుంచి వస్తున్నాయని, గతంలో ఇరాన్ నుంచి వచ్చేవని ఇరాన్లో ఉన్న ఆయిల్ నిక్షేపాలన్నింటినీ అమెరికా హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యుడు ఎండీ వాజీద్ అలీ, పాండు రంగారెడ్డి, పెంటయ్య, జార్జ్, రామకృష్ణ, నారాయణ ఇతరులు పాల్గొన్నారు.


