ఖేడ్ సమగ్రాభివృద్ధికి చర్యలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్/కల్హేర్ : ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపా రు. సోమవారం రూ.40 లక్షల ఎండీఎఫ్ నిధులతో నిర్మించనున్న ఆరు కల్వర్టుల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖేడ్లో సీసీతో రోడ్ల విస్తరణ, విశాలమైన మురుగు కాల్వలు, రోడ్ల మధ్యలో డివైడర్లు, మూడు చౌరస్తాల సుందరీకరణకు రూ. 16.38 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మొదటి విడత హ్యామ్ కింద రోడ్లకు సంబంధించిన పలురోడ్ల విస్తరణ, బలోపేతానికి రూ.120 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ. 56 కోట్లు, ఎస్డీఎఫ్ కింద పలు తండాలకు రోడ్ల కోసం రూ. 5 కోట్లు, అర్బన్ పార్కు కోసం రూ. 3.09 కోట్లు, డంప్యార్డులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ కోసం రూ. 40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మాజీ చైర్మన్ ఆనంద్ షెట్కార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్ అలీ, నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నల్లవాగులో చేప పిల్లలను వదిలారు. మత్య్సకారుల సంక్షేమం కోసం ప్రభు త్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలనలో చేప పిల్లలు విడుదల చేయకుండా నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా మత్య్సశాఖ శాఖ అధికారి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


