వదలని వర్షం.. రైతుకు కష్టం
పొలాల్లోనే రాలిపోతున్న పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం
నేల వాలుతున్న పత్తి పంట
సంగారెడ్డి జోన్: పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. తెల్ల బంగారంగా పిలువబడే ఈ పంటను జిల్లాలో అత్యధికంగా రైతులు సాగు చేస్తుంటారు. కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. అయితే ఈసారి పత్తికి కాలం కలిసి రాలేదనే చెప్పాలి. వానాకాలం సీజన్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. తీరా పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
3.87 లక్షల ఎకరాల్లో సాగు
ఈ వానాకాలం సీజన్లో 3.87 లక్షల ఎకరాలకుపైగా రైతులు పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే విత్తనాలు వేసిన సమయంలో సరైన విధంగా వర్షాలు కురవకపోవడంతో పంట ఎదుగుదల లోపించింది. కాయలు కాసిన తర్వాత కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచి రంగుమారి దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పత్తి పంట ఏరేందుకు సిద్ధంగా ఉంది. పత్తితీత సమయంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వర్షానికి పత్తి నేల రాలుతోంది. పంట దెబ్బతినడంతో పాటు నాణ్యత లోపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బరువు కూడా తగ్గిపోతుందని వాపోతున్నారు. ఎకరా విస్తీర్ణంలో పత్తి పంట వేసిన నాటి నుంచి పంట తీసి మిల్లుకు తరలించే వరకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు పెట్టుబడి అవుతోంది. ఎకరాలో పంట బాగా పండితే 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో అందుకు భిన్నంగా కేవలం 5 క్వింటాళ్ల లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. పంట సాగుకు చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట చేతికొచ్చే సమయంలో ఆగం
తేమ శాతం ఆధారంగా మద్దతు ధర
పత్తి పంటను కొనుగోలు చేసేందుకు జిల్లాలో 22 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాల్కు రూ. 8,110 చొప్పున మద్దతు ధరను నిర్ణయించారు. సీసీఐలో అమ్ముకునేందుకు తప్పనిసరిగా 8 నుంచి 12 తేమ శాతం లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే అమ్ముకునేందుకు వీలు ఉండదు. తేమ శాతాన్ని బట్టి మద్దతు ధరను నిర్ణయించనున్నారు.
వదలని వర్షం.. రైతుకు కష్టం
వదలని వర్షం.. రైతుకు కష్టం


