జాడలేని కొనుగోలు కేంద్రాలు
కొనుగోలు కేంద్రాలను ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారని సోయా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో దళారులు సోయా పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే
తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
– జహీరాబాద్ టౌన్:
జిల్లాలో వరి,పత్తి, కంది,మొక్కజొన్న తర్వాత వేలాదిమంది రైతులు సోయాబీన్ పంటను సాగు చేశారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 80 వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. జిల్లాలోనే జహీరాబాద్ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో పంటను వేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. కాత పూత దశలో కూడా భారీ వర్షాలు కురవడంతో పంటల దిగుబడిపై ప్రభావం చూపింది. ఏర్పడిన నష్టాన్ని ధర రూపంలో అయినా తీరనుందని రైతులు ఆశతో ఉన్నారు. అయితే పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు.
కనీస మద్దతు ధర రూ.5,328
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో క్వింటాల్కు రూ 4.892 ఉండగా 2025–26 ఏడాదికి రూ.5.328గా నిర్ణయించింది. కోతలు ప్రారంభంకావడంతో మార్కెట్కు పెద్ద మొత్తంలో ధాన్యం వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు బదులు వ్యాపారులు రూ.4 వేలకు లోపే పంటను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల కొంతమంది రైతులు గత్యంతరం లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. గతేడాది జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఝరాసంగంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఉత్పత్తిలో నాలుగవంతే కొనుగోలు చేయడం వల్ల మిగిలిన పంటను మార్కెట్లో వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. జహీరాబాద్ డివిజన్లోని గంగ్వార్, కోహీర్, మొగుడంపల్లి వద్ద ప్రైవేట్ వ్యక్తులు నారింజ రైతు మిత్ర సంఘం పేరుతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సోయాబీన్ పంటను కొంటున్నారు. వీరు కూడా క్వింటాల్కు రూ.4 వేల లోపే ధాన్యం తీసుకుంటున్నారు. పెట్టుబడులు విపరీతంగా పెరిగాయని, వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి పడిపోయిందని. తీవ్రంగా నష్టపోతున్నందున అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
అన్నదాతల ఎదురుచూపులు
మద్దతు ధర క్వింటాల్కు రూ.5.328
రూ.4 వేల లోపే కొంటున్న వ్యాపారులు
నష్టపోతున్న సోయా రైతులు


