
పర్యవేక్షణ ఫలించేనా?
సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యనందించేందుకు నిరంతర సమగ్ర మూల్యాంకనం, బోధనోపకరణాలు ఉపయోగించి బోధించడం లాంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని గుర్తించిన ప్రభుత్వం బడులను తనిఖీ చేసే బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతకుముందు కూడా ఇలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కుతగ్గిన సంగతి తెలిసిందే.
– న్యాల్కల్(జహీరాబాద్):
జిల్లాలో 864 ప్రాథమిక పాఠశాలలు, 191 ప్రాథమికోన్నత, 243 ఉన్నత పాఠశాలలు(ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు) ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 6,208 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు తొమ్మిది బృందాలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రెండు, ఉన్నత పాఠశాలలకు మూడు బృందాల చొప్పున జిల్లాలో 14 టీమ్లను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఎస్జీటీలు సభ్యులుగా ఉంటారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించిన కమిటీల్లో ముగ్గురు సభ్యులు ఉండగా, ఉన్నత పాఠశాలల కమిటీల్లో తొమ్మిది మంది సభ్యులుంటారు. ఈ కమిటీలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడతాయి.
తనిఖీ బృందాలతో మంచి ఫలితాలు!
ప్రస్తుతం పాఠశాలలను కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఏంఈఓలు తనిఖీ చేస్తున్నారు. ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం తనిఖీల కోసం ఈ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బృందాలు ఆయా పాఠశాలలను సందర్శించి పాఠశాలల్లో సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలు తీరు, బోధనా విధానం తదితర అంశాలను పరిశీలిస్తుంది. నివేదికలను పైఅధికారులకు పంపిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ సమీక్షలు నిర్వహించనుండటంతో మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా పాఠశాలలను ఉపాధ్యాయుల చేత తనిఖీ చేయించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతి రేకిస్తున్నాయి. అంతేకాకుండా అసలే ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులకు సరైన విద్యఅందడంలేదని, ఉన్న టీచర్ల నుంచే తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల చదువుపై ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల చేత పాఠశాలలను తనిఖీ చేయించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
బోధనపై ప్రతికూల ప్రభావం
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6,972 మంది ఉపాధ్యాయులు ఉండవలసి ఉండగా ప్రస్తుతం 6,208 మందే ఉన్నారు. ఇంకా 764 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమిటీల కోసం 60 మంది ఉపాధ్యాయులను తీసుకుంటే టీచర్ల కొరత ఇంకా ఎక్కువ కానుంది. ఫలితంగా చదువులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
బడుల తనిఖీ బాధ్యత టీచర్లకిస్తూ
ప్రభుత్వ నిర్ణయం
గతంలోనూ ఉత్తర్వులు జారీ
ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకతతో
ఉపసంహరణ
మళ్లీ తెరపైకి వచ్చిన పర్యవేక్షణ కమిటీలు
టీచర్లను అవమానించడమే
పాఠశాలలను ఉపాధ్యాయుల చేత తనిఖీ చేయించడం ఉపాధ్యాయులను అవమానించడమే. ఈ విధానాన్ని ఇంతకు ముందే వ్యతిరేకించాం. తనిఖీ కోసం ఉపాధ్యాయులను నియమిస్తే వారి కొరత ఇంకా అధికమై విద్యార్థులను నష్టం జరుగుతుంది. రెగ్యులర్ ఎంఈఓలు, నోడల్ అధికారులను నియమించి వారి చేత పాఠశాలలను తనిఖీ నిర్వహించాలి. దత్తాత్రి, తపస్ జిల్లా అధ్యక్షుడు
కమిటీలను ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలల తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 1,298 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వాటి తనిఖీ కోసం 14 బృందాలు ఏర్పాటు చేసి తనిఖీ చేపడతాం.
– వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి

పర్యవేక్షణ ఫలించేనా?