
టీకాలతోనే గాలికుంటు నివారణ
సంగారెడ్డి టౌన్: పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. ఈ వ్యాధి నివారణ కోసం టీకాల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్థక శాఖ సిద్ధమైంది. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రతీ ఏటా ఆరు నెలలకొకసారి వ్యాధి నిరోధక టీకాలను ఇస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు అధికారులు కార్యచరణ రూపొందిస్తున్నారు.
నెలరోజుల పాటు టీకాలు
ఈనెల15న టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా, వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లావ్యాప్తంగా 23,30,904 పశు పక్ష్యాదులుండగా వీటిలో మూడు నెలలు పైబడిన పశువులకు టీకాలు వేస్తారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీకాలు వేసిన పశువులకు గుర్తుగా కొమ్ములకు ఆకుపచ్చ రంగు వేస్తున్నారు.
వ్యాధి లక్షణాలు
పశువుల్లో తీవ్రమైన జ్వరం రావడంతో పాటు నీరసించిపోతాయి. నోటి నుంచి తీగల వలే చొంగ కారుతూ ఉంటుంది. కాలిగిట్టలు, నోటి వద్ద పుండ్లు ఏర్పడతాయి. కొద్దిపాటి ఎండను కూడా ఇవి తట్టుకోలేవు. చూడి పశువులు అయితే ఈనుకుపోతుంది. వీటి పాలు తాగే దూడలు మరణిస్తాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోతాయి. నాలుగు నెలల వయసు దాటిన పశువులు, జీవాలకు టీకా వేయించాలి. ఆవులు, గేదెలకు 2 మిల్లీ లీటర్ల చొప్పున టీకా ఇవ్వాలి. టీకాల వేయించడం ద్వారా అవి ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
సద్వినియోగం చేసుకోవాలి
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయించాలి. ఈ నెల 15 నుండి నవంబర్ 14 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో పశువులు ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ వసంతకుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
ముందస్తు టీకాలతో వ్యాధి నివారణ
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
ఝరాసంగం(జహీరాబాద్): పశువులకు ముందస్తుగా టీకాలు వేయడంతో గాలికుంటు వ్యాధి నివారణ చేయవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో ఆవులు, ఎద్దులు, గేదెలకు బుధవారం ఉచితంగా టీకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 1.45 లక్షల పశువులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్రావు పాటిల్, నాయకులు చంద్రశేఖర్, మారుతి రావు పాటిల్, సంగ్రామ్ పాటిల్, వేణుగోపాల్రెడ్డి, సంగమేశ్వర్, సిబ్బంది హర్షవర్ధన్ రెడ్డి, సునీల్దత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా
ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన అధికారులు
1.40లక్షల పశువులకు టీకాలు
సద్వినియోగం చేసుకోనున్న రైతులు

టీకాలతోనే గాలికుంటు నివారణ