
తీరనున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వెతలు!
సంగారెడ్డి జోన్: ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకం. అర్హులైన ప్రతీ ఒక్కరికి పనులు కల్పించటంతో పాటు హాజరు, కొలతలు చేపట్టడంతో పాటు వివిధ రకాల పనులు నిర్వహిస్తారు. అయితే కొనేళ్లుగా వారికి సరైన వేతనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల మంత్రి సీతక్క ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపశమనం కలిగించే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బదిలీలకు కార్యాచరణ
జిల్లాలోని 619 గ్రామ పంచాయతీలలో 332 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతీనెల సుమారు రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకు వేతనం అందిస్తున్నారు. అయితే అందరికీ సమాన వేతనం కల్పించాలని పలుమార్లు సమ్మె సైతం నిర్వహించారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల కోరిక మేరకు సమాన వేతనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్న్స్తో పాటు హెల్త్కార్డులు మంజూరు చేయనున్నారు. ఎక్స్గ్రేషియా రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెరగనుంది. అలాగే గత ప్రభుత్వం తీసుకొవచ్చిన 4779 సర్కులర్ను రద్దు చేయనున్నారు. గతంలో వివిధ కారణాలతో తొలగించిన వారిని తిరిగి విధుల్లో నియమించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల అభ్యర్థన మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. ఉపాధి హామీలో విధులు నిర్వర్తిస్తున్న జిల్లాస్థాయిలో ఏపీడీ, మండలస్థాయిలో ఏపీఓ, జేఈ, టెక్నికల్ అసిస్టెంట్లు ప్రతి మూడు, నాలుగేళ్లకు ఒకసారి బదిలీలు చేపట్టినప్పటికీ, విధుల్లో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు ఫీల్డ్ అసిస్టెంట్ల బదిలీలు చేపట్టలేదు. ప్రస్తుతం పలు రకాల సమస్యలు పరిష్కారం అవుతుండటంతో ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీల చోట్ల పనులకు ఇబ్బందులు
జిల్లాలో చాలా చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. సగానికి పైగా గ్రామాలతో పాటు కొత్తగా ఏర్పాటైన పంచాయతీలలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం చేపట్టలేకపోయారు. ఆ గ్రామాలలో వివిధ రకాల పనులు చేపట్టేందుకు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారంతో పాటు కొత్తగా పోస్టులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
సమాన వేతనం పాటు సౌకర్యాలు
తొలగించిన వారికి నియమించేలా చర్యలు
జిల్లాలో 332 మందికి లబ్ధి
కొత్త జీపీలలో నియామకాలు అయ్యేనా?