
స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడమే లక్ష్యం
పటాన్చెరు టౌన్ : గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడం, మహిళలకు సాధికారత కల్పించి పేదరికాన్ని తగ్గించడం ఎన్ఆర్ఎల్ఎం ముఖ్య ఉద్దేశమని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సభ్యుడు సృజన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లక్డారం గ్రామంలో ఎన్ఆర్ఎల్ఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలతో మాట్లాడి కేంద్ర పథకాలపై ఆరా తీశారు. అలాగే పెన్షన్ అందుతుందా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఎంపీడీవో యాదగిరి, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, డిప్యూటీ ఈఈ తదితరులు సన్మానించారు.
రిపబ్లిక్ డే పరేడ్కు శిక్షణ
గజ్వేల్రూరల్: ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో గజ్వేల్లోని బాలుర హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొననున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రతియేటా జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో ఎన్సీసీ క్యాడెట్లు పరేడ్లో పాల్గొంటారని చెప్పారు. ఇందులో భాగంగానే గజ్వేల్ ఎన్సీసీ విభాగం 33వ తెలంగాణ సంగారెడ్డి బెటాలియన్ ఆధ్వర్యంలో పలువురు క్యాడెట్లను ఎంపిక చేశామని, ఈ సందర్భంగా వారికి ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నట్లు లెఫ్టినెంట్ మహేందర్రెడ్డి తెలిపారు.
క్రీడా ప్రాంగణం ఆక్రమణ.. కేసు
జిన్నారం (పటాన్చెరు): ప్రభుత్వ క్రీడా ప్రాంగణాన్ని ఆక్రమించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బొల్లారం పట్టణ పరిధిలోని 254 సర్వే నంబర్లోని ప్రభుత్వ క్రీడా స్థలాన్ని స్థానికులు రాజ్ గోపాల్, జితయ్య, ప్రవీణ్ క్రీడా ప్రాంగణంలో అక్రమంగా కంటైనర్ను ఏర్పాటు చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అధికారులు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం బోర్డును ధ్వంసం చేసి తొలగించారు. ఈ వ్యవహారంపై జిల్లా యువజన క్రీడా శాఖ సీనియర్ అసిస్టెంట్ అభినవ్ కుమార్ శుక్రవారం బొల్లారం సీఐ రవీందర్ రెడ్డికి ఫిర్యాదు చేయగా, ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
ఒకరిపై కేసు నమోదు
అక్కన్నపేట(హుస్నాబాద్): భూ తగాదాలో ఒకరిపై కేసు నమోదైంది. ఈ ఘటన మండలంలోని పెద్దతండా గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సీహెచ్. ప్రశాంత్ వివరాల ప్రకారం... తండాకు చెందిన గుగులోతు కోమ, మంక్య్త భార్యాభర్తలు. కాగా భూ వివాదంలో కాశబోయిన అశోక్ వీరిపై దాడికి పాల్పడినట్లు కోమ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కొండెంగ దాడి.. గాయాలు
జహీరాబాద్: పట్టణ ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు రోగులపై కొండెంగలు దాడి చేయడంతో గాయపడ్డారు. శుక్రవారం పట్టణానికి చెందిన అబ్దుల్ ఖాదర్, అక్రం అలీలు వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చారు. ఆవరణలో ఉన్న కొండెంగలు వారిపై దాడి చేయడంతో కాలికి కుట్లు పడ్డాయి. ఆస్పత్రి ఆవరణలో సంచరించే కొండెంగలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.
విద్యుదాఘాతంతో గేదె మృతి
చేర్యాల(సిద్దిపేట): విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని వీరన్నపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పొన్నబోయిన ప్రభాకర్ తన పాడి గేదెను రోజులాగే భావి వద్ద తీసుకెళ్లి మేత మేపుతుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.

స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడమే లక్ష్యం