
వీధి కుక్కల దాడి
● పలువురికి గాయాలు
శివ్వంపేట(నర్సాపూర్): వీధి కుక్కల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఒకే రోజు గ్రామానికి చెందిన వంజరి నర్సయ్య, వరలక్ష్మి, అనిత, మహేష్పై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు గురైన వారు చికిత్స చేయించుకున్నారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, నివారణకు చర్యలు తీసుకోవాల ని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
పనిచేస్తున్న చోటేసర్దుబాటు చేయాలి
మెదక్ కలెక్టరేట్: ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు తరలించకుండా పనిచేస్తున్న చోటే వర్క్ సర్దుబాటు చేయాలని ఎస్జీటీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మెదక్ డీఈఓ రాధాకిషన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. 20లోపు విద్యార్థులున్న చోట ఇద్దరు, 40లోపు విద్యార్థులున్న పాఠశాలల్లో ముగ్గురు, 60 లోపు విద్యార్థులుంటే 4మంది, 60 దాటితే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని, వందమంది దాటితే ఆ పాఠశాలకు నిబంధనలు పెట్టకుండా తరగతి గదికి ఉపాధ్యాయుడితోపాటు హెచ్ఎంను కూడా నియమించాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జింక అశోక్, జగన్, నాయకులు దశరథం, గణేష్ పాల్గొన్నారు.
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
నర్సాపూర్ రూరల్: యువకుడు అదృశ్యమైన ఘటన మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెలమకన్నె నవీన్(26) నర్సాపూర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు. కాగా ఈనెల 14న బంకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో అతడి ఫోన్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. నవీన్ అన్న జగన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తొమ్మిది నెలల గర్భిణి ..
పటాన్చెరు టౌన్: తొమ్మిది నెలల గర్భిణి అదృశ్యమైన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన పప్పుసింగ్ భార్య పూజాభాయితో కలిసి బతుకుదెరువు కోసం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్ తండాకు వచ్చారు. గుడిసె వేసుకొని ఆయుర్వేదిక్ మందులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పూజాభాయి 15వ తేదీన తెల్లవారుజామున ఎరుపు రంగు కారులో వెళ్లిందని స్థానికులు చెప్పడంతో భర్త వెళ్లి చూడగా కారు కనిపించలేదు. చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.