
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
దుబ్బాకటౌన్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రఘపతి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బోనగిరి బాలయ్య (65) భార్య హంసవ్వతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగి హంసవ్వ అమ్మగారింటికి వెళ్లిపోయింది. దీంతో పెద్దల సమక్షంలో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె ఒప్పుకోలేదు. బాలయ్య తరచూ తన కూతురికి ఫోన్ చేస్తూ బాధపడేవాడు. దీంతో మనస్తాపానికి గురై అతడు ఆదివారం ఉరివేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి..
చేగుంట(తూప్రాన్): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాసాయిపేట మండల పోతాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బర్రె మహేశ్(30) ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. మహేశ్ ఇటీవల కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన అతడు శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు.
మెదక్ పట్టణంలో వ్యక్తి..
హవేళిఘణాపూర్(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన మధుసూదన్రెడ్డి, భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అతడు బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు వృథా చేయడంతోపాటు మద్యం తాగి భార్యను కొడుతున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో భర్త..
జగదేవ్పూర్(గజ్వేల్): భార్య ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని నిర్మల్నగర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రె కిరణ్(27) హైదరాబాద్లో పనిచేస్తున్న క్రమంలో కామారెడ్డికి చెందిన నీరజను ఐదేళ్ల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలోనే ఉంటున్నారు. ఆమె గజ్వేల్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుండగా, కిరణ్ గ్రామంలోనే వ్యవసాయం, పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. వీరికి ఇద్దరు ఐదేళ్ల లోపు కుమార్తెలు ఉన్నారు. కాగా కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. భార్య ఇంట్లో చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం సాయంత్రం ఇంటి వద్ద పెద్ద కూతురుకు సెల్ఫోన్ ఇచ్చి తాను ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని మంచం నవారుతో ఊరేసుకుకున్నాడు. ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.