
ఇది ప్రభుత్వ భూమి.. కాదు పట్టా భూమి
కౌడిపల్లి(నర్సాపూర్): ఇది ప్రభుత్వ భూమి అని కబ్జా చేయవద్దని మండలంలోని వెల్మకన్న గ్రామస్తులు, బీజేపీ నాయకులు జేసీబీతో చేయిస్తున్న పనులను అడ్డుకున్నారు. కాగా ఇది మా సొంత భూమి అని పట్టా కూడా ఉందని స్థలం యజమాని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరగగా పోలీసులకు విషయం తెలియడంతో నచ్చజెప్పారు. ఈ ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మోతీలాల్గౌడ్కు గ్రామ సమీపంలో వెల్మకన్న శివారులో వ్యసాయ భూమి ఉంది. కాగా బుధవారం జేసీబీతో ఆ స్థలంలో రాళ్లు తొలగించి చదును చేస్తున్నాడు. ఇది గమనించిన గ్రామస్తులు, బీజేపీ నాయకులు రాజేందర్, రాకేష్, అశోక్, రవిసాగర్ తదితరులు జేసీబీ ఆపాలని అడ్డుకున్నారు. దీంతో గొడవ జరుగుతుండటంతో స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డి, పోలీసులు అక్కడి చేరుకుని ఇరువురికి నచ్చజెప్పారు. పట్టాభూమిలో పనులు చేసుకుంటున్నానని మోతీలాల్గౌడ్ చెప్పగా, ఇది ప్రభుత్వ భూమి అని వెల్మకన్న గ్రామస్తులు వాదించారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దీంతో ఎస్ఐ తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తహసీల్దార్, ఇతర రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సుల్లో ఉన్నారని, అవి ముగిసిన తరువాత భూమి సర్వేచేసి హద్దులు నిర్వహిస్తామని ఎస్ఐ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
ఇరు వర్గాల మధ్య వాగ్వాదం
పనులను అడ్డుకున్న గ్రామస్తులు, బీజేపీ నాయకులు
ఎస్ఐ హామీతో సద్దుమణిగిన గొడవ