
ఇంటి కోసమే పెదనాన్న హత్య
పటాన్చెరు టౌన్ : ఇంటిని దక్కించుకుందామని ప్లాన్ ప్రకారం పెదనాన్నపై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. బుధవారం బీడీఎల్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ స్వామి గౌడ్ వివరాలు వెల్లడించారు. పటాన్చెరు మండలం ఘనపూర్కు చెందిన చెర్ల రాములు(55)కు గ్రామంలో పాత ఇల్లు ఉంది. భార్యాపిల్లలతో కలిసి అతడు రామచంద్రాపురం అశోక్నగర్లో నివాసం ఉంటున్నాడు. కాగా రాములు తమ్ముడి కొడుకు దిలీప్ పక్క పోర్షన్లోనే ఉంటున్నాడు. అయితే ఆయనకు తెలియకుండా ఇంట్లో ఉన్న సామగ్రిని ఇంటి బయట సబ్జాపై పడేసి, ఓ మహిళకు అద్దెకిచ్చాడు. ఈనెల 5వ తేదీ రాత్రి రాములు గ్రామానికి వచ్చి తన ఇంట్లో ఉన్న మహిళను ఇల్లు అద్దెకు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. అప్పుడే వచ్చిన తమ్ముడి కొడుకు దిలీప్కి ఆ మహిళ విషయం చెప్పింది. నా ఇంటిని కిరాయికి ఎలా ఇస్తావని దిలీప్పై అరిచాడు. ఇంటిని దక్కించుకుందామని ప్లాన్ వేసుకున్న దిలీప్ కట్టెల పొయ్యిలో ఉన్న కట్టె తీసుకొని విచక్షణారహితంగా కొట్టాడు. రాములు చేయి విరిగి కింద పడిపోగా ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకొని స్కూటీపై గ్రామంలోని కిరాణాషాప్కు వెళ్లి బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చాడు. వాకిట్లో పడి ఉన్న రాములుపై బట్టలు తీసుకువచ్చి మీద వేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. అతను చనిపోయాడనుకొని స్కూటీపై కొద్ది దూరం వెళ్లి గమనిస్తున్నాడు. ఈ క్రమంలో రాములు మంటల్లో నుంచి లేచి ఇంటి ప్రక్కన ఉన్న డ్రమ్ములో నీళ్ళు పోసుకొని మంటలను ఆర్పుకున్నాడు. మళ్లీ దిలీప్ రాములు వద్దకు వచ్చి కట్టెతో కొట్టగా అతడు కింద పడిపోగా, ఈడ్చుకుంటూ వెళ్లి మంటల్లో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్కు వెళ్లాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాములును ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
తమ్ముడు కుమారుడి రిమాండ్
వివరాలు వెల్లడించినబీడీఎల్ సీఐ స్వామి గౌడ్
పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తుండగా బుధవారం ఉదయం ఇంటికి బట్టలు తీసుకునేందుకు వచ్చిన దిలీప్ను సీఐ స్వామి గౌడ్, ఎస్ఐ లక్ష్మారెడ్డి సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన స్కూటీ, ఫోన్, పెట్రోల్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు.