
ప్రముఖులు చదివిన పాఠశాల
మామిడి తోరణాలు కట్టి
వర్గల్(గజ్వేల్): సర్కారు బడులు వేసవి సెలవులు ముగించుకుని గురువారం పునఃప్రారంభమవుతున్న వేళ విద్యార్థిలోకానికి స్వాగతం పలుకుతున్నాయి. ఈ సందర్భంగా వర్గల్ మండలం బొర్రగూడెం ప్రాథమిక పాఠశాలను హెచ్ఎం రాజనరేందర్రెడ్డి బృందం బుధవారం శుభ్రం చేయించి, మామిడి తోరణాలు కట్టి స్వాగత ఏర్పాట్లు చేశారు. చక్కని చదువుతో భవిష్యత్కు పునాదులు వేస్తామని భరోసా కల్పిస్తున్నారు.
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని అల్లీపూర్లోని మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ (ఎంఆర్హెచ్ఎస్ ) అత్యంత పురాతనమైన ఎయిడెడ్ పాఠశాల. మెథడిస్ట్ సంస్థ 1931లో సుమారు 63 ఎకరాల్లో పాఠశాలను స్థాపించింది. అమెరికాకు చెందిన గార్డెన్ దొర దంపతులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించారు. 94 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పాఠశాలలో 1 నుంచి 10 తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో బోధన చేస్తున్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయుల కోసం ఇల్లు కట్టించారు. ఆటల కోసం విశాల మైదానం, హాస్టల్ భవనం, బాలబాలికల కోసం టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం తదితర వసతులు కల్పించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, స్వర్గీయ మాజీ మంత్రి ఫరిదుద్దీన్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితర ప్రముఖులు ఇక్కడే చదువుకున్నారు. ఈ పాఠశాలలో చదివిన వారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, డాక్టర్లు, ఇంజినీర్లు ఇలా ప్రతి రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పట్లో పాఠశాలలో అడ్మిషన్ దొరకడం కష్టంగా ఉండేది. సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనేది. ప్రస్తుతం పర్యవేక్షణ కొరవడటంతో ఆదరణ తగ్గుతోంది. అయినా ఇప్పటికీ 1200 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ హెచ్ఎంగా పనిచేసిన మిస్ రత్న శేషప్ప, స్వర్గీయ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్గా అవార్డును అందుకున్నారు.

ప్రముఖులు చదివిన పాఠశాల