సర్కారు బడికి టీచర్‌ కుమారుడు | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడికి టీచర్‌ కుమారుడు

Jun 12 2025 11:05 AM | Updated on Jun 12 2025 11:05 AM

 సర్కారు బడికి టీచర్‌ కుమారుడు

సర్కారు బడికి టీచర్‌ కుమారుడు

రామాయంపేట(మెదక్‌): తాను పనిచేస్తున్న పాఠశాలలోనే ఓ ఉపాధ్యాయురాలు తన కుమారున్ని చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మండలంలోని రాయిలాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు ప్రవళిక విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రైవేట్‌ స్కూలులో చదువుతున్న కుమారుడు కార్తీక్‌ను తాను పనిచేస్తున్న పాఠశాలలోని మూడో తరగతిలో చేర్పించేందుకు అడ్మిషన్‌ తీసుకున్నారు. సదరు ఉపాధ్యాయురాలిని మండల విద్యాధికారి శ్రీనివాస్‌, ఇతర ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఎంఈవో విద్యార్థి కార్తీక్‌కు అడ్మిషన్‌ పత్రాన్ని అందజేశారు.

17మందికి జరిమానా

గజ్వేల్‌రూరల్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 17మందికి కోర్టు జరిమానా విధించిందని గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మురళి తెలిపారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం తాగి పట్టుబడ్డారని పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ స్వాతిగౌడ్‌ ఎదుట హాజరు పర్చగా, విచారణ అనంతరం 17 మందికి వెయ్యి రూ. చొప్పున 17వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.

రెండు బైకులు ఢీకొని

వ్యక్తి మృతి

పుల్‌కల్‌(అందోల్‌): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవానానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఎస్‌ఐ క్రాంతి కుమార్‌ కథనం ప్రకారం... మండల పరిధిలోని తాడ్‌దాన్‌పల్లి గ్రామానికి చెందిన బేగరి యాదయ్య(40) గొంగ్లూర్‌ గ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. గొంగ్లూర్‌ గ్రామానికి చెందిన అర్జున్‌, రాజు అనే యువకులు ద్విచక్రవాహనంపై సంగారెడ్డి వైపు వెళుతున్నారు. బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో బేగరి యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అర్జున్‌,రాజులకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బేగరి యాదయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ములుగు(గజ్వేల్‌): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వివరాల ప్రకారం... మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా రావల్‌కోల్‌ మండలం దొంగలగుట్ట తండాకు చెందిన కోడావత్‌ రాములు(47)ఈ నెల 5న సాయంత్రం సొంతపనిపై బైక్‌పై ములుగు మండలం కొత్తూరుకు వచ్చి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం

రామాయంపేట(మెదక్‌): ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్‌ తన కుటుంబంతో కలిసి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పూరిగుడిసె వెనుకభాగంలో నిర్మాణ పనులు ప్రారంభించాడు. కాగా ఇల్లు మంజూరు లిస్టులో అతని పేరు లేకపోవడంతో ఆవేదన చెందాడు. దీంతో మంగళవారం రాత్రి గ్రామ శివారులో క్రిమి సంహారక మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే అతడి తండ్రి నర్సిహులు అంబులెన్సులో మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం వైద్యులు అశోక్‌ను డిశ్చార్జి చేశారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీవో సజీలుద్దీన్‌ను సంప్రదించగా.. అశోక్‌కు మొదటి లిస్టులో ఇల్లు మంజూరు కాలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement