
పదికిలోల ప్లాస్టిక్ తెచ్చి..వెండి నాణెం తీసుకోండి
ములుగు (గజ్వేల్ ) : ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని చైత్యన్య పరుస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాడు. ఆయనే ములుగు మండలం క్షీరసాగర్కు చెందిన కొన్యాల బాల్రెడ్డి. తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామం వైపు నడిపించేందుకు కేబీఆర్ పౌండేషన్ ద్వారా 2023 ఏప్రిల్లో 10 కిలోల ప్లాస్టిక్ తెచ్చివ్వండి..10 గ్రాముల వెండి నాణెం తీసుకెళ్లండి అంటూ గ్రామస్తుల నుంచి సుమారు 1000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాడు. అందరి చేత భేష్ అనిపించుకున్నాడు.
ఉపాధిహామీ కూలీలతో
60 వేల విస్తరాకులు
హుస్నాబాద్రూరల్: రైతులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)దేవకి దేవి నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు. ఈ నెల 6,7,8 తేదీల్లో హుస్నాబాద్లో జరిగే కిసాన్ మేళాకు వచ్చే రైతులకు మోదుగ ఆకుల విస్తరిలో భోజనాలు పెట్టి పర్యావరణ ప్రాధాన్యతపై అవగాహన కల్పించేలా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీల్లోని స్వశక్తి సంఘాల మహిళలు, ఉపాధిహామీ కూలీల సహకారంతో 60 వేల మోదుగ విస్తర్లను తయారు చేయిస్తున్నారు. కిసాన్ మేళాకు వచ్చే రైతులు, అతిథితులకు ప్లాస్టిక్కు బదులుగా మోదుగ ఆకుల విస్తర్లు, స్టీల్ ప్లేట్స్ను వాడనున్నారు. ప్లాస్టిక్ గ్లాస్లకు బదులు స్టీల్ గ్లాస్లను వినియోగించడంతో 2లక్షల ప్లాస్టిక్ గ్లాస్ల వాడకం తగ్గించనున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల వద్ద ఉన్న స్టీల్ బ్యాంకును కిసాన్ మేళాల్లో వినియోగించడానికి సిద్ధమవుతున్నామని డీపీఓ తెలిపారు.

పదికిలోల ప్లాస్టిక్ తెచ్చి..వెండి నాణెం తీసుకోండి