మొక్కలు లేకుండా ఖాళీగా కనిపిస్తున్న మట్టి బ్యాగులు హత్నూర మండలం మధుర గ్రామ నర్సరీలోని చిత్రమిది. సరైన సమయంలో బ్యాగుల్లో విత్తనాలు వేయకపోవడం, అవసరం మేరకు నీళ్లు పట్టకపోవడంతో సగానికి పైగా మొక్కలు మొలకెత్తలేదు. నిజానికి ఒక్కో బ్యాగులో రెండేసి విత్తనాలు వేస్తారు. ఒకటి మొలక రాకపోయినా.. ఇంకో విత్తనం మొలకెత్తుతుంది. కానీ నిర్వహణ లోపం కారణంగా బెడ్లలో సగానికిపైగా బ్యాగులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఒక్క మధుర గ్రామంలోని నర్సరీదే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు నర్సరీల్లోనూ ఇదే పరిస్థితే నెలకొంది.
– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
నర్సరీల్లో మొక్కల పెంపకం విషయంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏటా డిసెంబర్ చివరి వారం వరకు పాలిథిన్ కవర్లలో మట్టిని నింపి (బ్యాగ్ ఫిల్లింగ్) చేసి విత్తనాలు పెట్టుకుంటే జర్మినేషన్ 100 శాతం ఉంటుంది. కానీ అప్పట్లో గ్రామపంచాయతీల కార్యదర్శులకు సర్వే, ఇతర పనుల పేరుతో ఈ నర్సరీలను పట్టించుకోలేదు. డిసెంబర్ నెలాఖరులోగా విత్తుకోవాల్సి ఉండగా, చాలా నర్సరీల్లో ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా విత్తనాలు వేసుకోలేదు. ఇప్పుడు మొక్కల జర్మినేషన్ తగ్గడానికి ఆలస్యంగా విత్తుకోవడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ నర్సరీల నిర్వహణను కూడా కొన్ని గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొందనే వాదన కూడా ఉంది.
38 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం కాగా..
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా 38 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 619 చోట్ల ఉన్న నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఇందులో సుమారు 19 లక్షల మొక్కల కోసం కొత్తగా విత్తనాలు వేసుకోగా, గత ఏడాది నాటకుండా మిగిలిపోయిన మరో 19 లక్షల మొక్కలను ఈ ఏడాదికి సిద్ధంగా ఉంచుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే జర్మినేషన్ తగ్గడంతో ఈసారి వనమహోత్సవానికి సరిపడా మొక్కలు పెరగడం ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జర్మినేషన్ 11 శాతం తగ్గిందంటున్న అధికారులు 40 శాతానికి మించి నాటుకోలేదని అనధికారిక అంచనా నర్సరీల నిర్వహణను గాలికొదిలేసిన గ్రామ కార్యదర్శులు వనమహోత్సవానికి మొక్కలు సిద్ధం కావడం ప్రశ్నార్థకమే
గతంలో మాదిరిగానే..
గత ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో ఏటా వర్షాకాలంలో విరివిగా మొక్క లు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా లక్షల్లో మొక్కలు నాటినప్పటికీ.. వందల్లో కూడా మొక్కలు పెరగకపోవడంతో ప్రజాధ నం చాలా మట్టుకు వృథా అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వనమహోత్సవం పేరుతో వర్షాకాలం రాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. అయితే గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు కూడా సరైన నిర్వహణ లోపం కారణంగా ప్రజాధనం వృధా అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సరిపోను మొక్కలను సిద్దం చేస్తున్నాం
ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమానికి 38 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించాం. ఈ మేరకు నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాం. అయితే ఈసారి కొన్ని నర్సరీల్లో మాత్రమే జర్మినేషన్ తగ్గినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం. లక్ష్యానికి సరిపోను మొక్కలను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– మణికుమార్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్
మొక్కలేని సంకల్పం!