
ఉగ్రవాదుల పిరికిపంద చర్య
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్
సంగారెడ్డి రూరల్: ఉగ్రదాడి పిరికిపంద చర్య అని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆదివారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేకే భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ... ఉగ్రవాదులు జరిపిన కాల్పులను ప్రజాతంత్రవాదులు, మేధావులు, కుల, రాజకీయ పార్టీలు, యువత ముక్తకంఠంతో ఖండించాలన్నారు. దేశంలో సైనిక వ్యవస్థను ప్రైవేటుపరం చేయడం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఆర్మీని నిఘా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ప్రజలతోపాటు దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను 50 లక్షల ఎక్స్్గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి నాయకులు సాయి, శివ, ప్రశాంత్ శ్రీకాంత్, సురేష్, ప్రవీణ్, దేవదాస్, అమీర్ పాల్గొన్నారు.