
మామిడి కాయకు కవర్
జహీరాబాద్ టౌన్: పెరిగిన పెట్టుబడులతో పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం జిల్లాలోని కొంత మంది రైతులు వినూత్న ఆలోచనలతో వ్యవసాయంలో ముందుకు వెళ్తున్నారు. కొంచెం ఖర్చు ఎక్కువైనా మంచి ఆదాయం పొందుతున్నారు. చీడపీడల నుంచి రక్షణ, బరువు పెరిగి అధిక లాభాలు రావడానికి మామిడి కాయలకు కవర్లు కడుతున్నారు. సాధారణంగా కంటే కూడా కవర్లలో పెరిగే మధుర ఫలం నాణ్యతతో పాటు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో రైతులకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది.
లాభాలు అనేకం
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల మామిడి చెట్లు పూత పూసినా కాత నిలబడటం లేదు. 60 నుంచి 70 శాతం పిందె రాలిపోతోంది. ఈ పరిస్థితిలో పంటను కాపాడుకొని దిగుబడి పెంచుకోవడం రైతులకు కష్టమవుతోంది. కాయకు కవర్ కట్టే విధానం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మామిడి కాయ కోడిగుడ్డు సైజులోకి రాగానే కవర్లు కడతారు. దీని వల్ల తొడిమ వద్ద నల్లగా మసి రావడం, పురుగు పట్టడం, సొన కార డం లాంటివి తగ్గుతాయి. దీంతో పురుగు మందుల అవసరం చాలా వరకు ఉండదు. ఈదురు గాలులు, వడగండ్ల వానకు కాయలు రాలవు. మాములు కాయకంటే బరువు ఎక్కువగా ఉంటుంది. చూసేందుకు పండ్లు నీట్గా ఉంటాయి. చెట్టుపైనే పక్వానికి రావడం వల్ల అధిక ధర పలుకుతుంది.
ఖర్చు ఎక్కువ
మామిడి కాయలకు కవర్ కట్టడం వల్ల కొంచెం ఖర్చు ఎక్కువ. ఒక్కో బ్యాగ్కు రూ. 2.50 పైసలకు లభిస్తుంది. కట్టడానికి రూ.2.50 కూలీ ఖర్చు అవుతుంది. ఈ బ్యాగ్ లోపలివైపున నల్లరంగు, బయటవైపు గోధమ రంగులో ఉంటుంది. వీటిని కట్టడానికి ముందు కాయలను బట్టతో శుభ్రం చేయాలి. కాయ కింది భాగం నుంచి తొడిమ పైభాగంలో మూడు సెంటీమీటర్ల పైన కట్టాలి.
అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు
మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల కలిగే లాభాల గురించి కొండా లక్ష్మణ్ ఉద్యాన కళాశాల విద్యార్థులకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మండలంలోని రంజోల్ గ్రామ పరిధిలోని మామిడి తోటల వద్ద రైతులకు ప్రాక్టికల్గా కవర్లు కట్టడం చూపిస్తున్నారు. ఈ విధానం వల్ల కాయ బరువు పెరిగి రైతులకు అధిక లాభాలు వస్తాయనిచెబుతున్నారు.
మధుర ఫలానికి రక్షణ
వినూత్న విధానంలో సాగు
పెరుగుతున్న కవర్ల వినియోగం
పూత నుంచి కోత వరకు..
మామిడి చెట్లకు పూత వచ్చినప్పటి నుంచి కాయలు కోతకు వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగండ్ల వాన, ఈదురుగాలులు, చీడపీడల బెడద కారణంగా పంటకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు మ్యాంగో ప్రొటెక్షన్ బ్యాగ్స్(కాయలకు రక్షణ సంచులు)ను ఏర్పాటు చేస్తున్నారు. కాయలకు కవర్లు కట్టడం వల్ల పండ్లలో నాణ్యత ప్రమాణాలు పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయవచ్చు.
కవర్లను సబ్సిడీపై ఇవ్వాలి
జహీరాబాద్ పట్టణ సమీపంలో గాయత్రి పామ్హౌస్లో సుమారు 30 ఎకరాల్లో మామిడి తోట ఉంది. సుమారు 4 లక్షల కవర్లు కట్టాం. మూడేళ్ల నుంచి కాయలకు కవర్లు కడుతున్నాం. మామూలు కాయకంటే కవర్ కట్టిన కాయ చాలా నీట్గా అధిక బరువు ఉంటుంది. కానీ కవర్ల ఖర్చు ఎక్కువ అవుతోంది. ఒక్కో కవర్ రెండు నుంచి మూడు రుపాయలకు లభిస్తుంది. కట్టడానికి కూలీల ఖర్చు కూడా అవుతుంది. ఈ బ్యాగ్లు హైదరాబాద్లో దొరకనందున ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఉద్యానశాఖ తరపున కవర్లు సబ్సిడీపై ఇవ్వాలి. అప్పుడే రైతులు ముందుకు వస్తారు. రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే సబ్సిడీపై కవర్లు ఇస్తున్నారు. ఈ జిల్లాలో కూడా ఇవ్వాలి.
– హరీశ్, మామిడి రైతు, జహీరాబాద్

మామిడి కాయకు కవర్

మామిడి కాయకు కవర్