
‘ఉపాధి’ పనులు భేష్
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు బేషుగ్గా ఉన్నాయని విదేశీ ప్రతినిధులు కితాబిచ్చారు. వివిధ దేశాలకు చెందిన 25మంది విదేశీ ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి మండలంలోని సూరారం గ్రామంలో శుక్రవారం పర్యటించారు. గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. గ్రామానికి చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు కూలీలతో మాట్లాడి పథకం అమలుపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాలు, వేతన చెల్లింపులు,మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విదేశీ బృందానికి నీటి సంరక్షణ,పల్లె ప్రగతి కింద చేపడుతున్న పనులపై, సామాజిక తనిఖీపై వివరించారు.విదేశీ ప్రతినిధులు తెలంగాణలో పథకం అమలు పద్ధతులను మెచ్చుకున్నారు.ప్రత్యేకించి డిజిటల్ మానిటరింగ్ విధానాలు,పారదర్శక చెల్లింపుల వ్యవస్థలు, మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను వారు ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో లేని ఈ ఉపాధి హామీ పథకం భారతదేశంలో మాత్రమే ఉందని మెచ్చుకున్నారు. అంతకుముందు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులతో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ,అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు కమిషనర్ శేషుకుమార్, ఎస్పీఎం మురళీ, పీడీ జ్యోతి,అదనపు డీఆర్డీఓలు బాలరాజు, జంగారెడ్డి,ఎన్జీవో ప్రతినిధులు వర్షిణి, పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
విదేశీ ప్రతినిధుల బృందం కితాబు

‘ఉపాధి’ పనులు భేష్